Chandrababu Case: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 – ఏ కింద గవర్నర్ నుండి ముంగస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టేయాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ నెల 16 న (మంగళవారం) తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్స్ హరీశ్ సాల్వే, సిద్ధార్ధ్ లూథ్రా బలమైన వాదనలు వినిపించగా. ఏపీ ప్రభుత్వం తరుపున మరో సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఈ కేసులో ఇరుపక్షాలు సుదీర్ఘంగా బలమైన వాదనలు చేశారు. జస్టిస్ అనిరుద్ద భోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని అక్టోబర్ 17న తీర్పు రిజర్వు చేసింది. అయితే ఈ అంశంతో ముడిపడి ఉన్న రెండు కేసుల విచారణ ( ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు) ఈ నెల 17,18 తేదీల్లో విచారణకు రానున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు వాటికంటే ముందు 17 – ఏ పై నిర్ణయం వెలువరించనుంది.
సుప్రీం కోర్టు వెలువరించనున్న తీర్పు ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలకం కానున్నది. ఈ తీర్పులో వెలువడే నిర్ణయం మీద చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఇతర కేసుల పరిస్థితి ఆధారపడి ఉంది. స్కిల్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు పట్ల ఒక్క ఏపీ రాజకీయ వర్గాలే కాక దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు కేసులో జస్టిస్ అనిరుద్ద భోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఇవ్వనున్న తీర్పు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవ్వనుంది. చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుంది అని ఆయన తరపు హరీష్ సాల్వే బలమైన వాదనలు వినిపించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ ..ఒక వేళ 17 – ఏ వర్తించినా మిగతా సెక్షన్లు ఉన్నందున ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం కుదరదు అన్నట్లుగా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పుపై ఎలా వస్తుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరో పక్క న్యాయవాద వర్గాల్లోనూ భిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఈ కేసులో భిన్నాభిప్రాయాలు వస్తే తదుపరి విచారణకు సీజే నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. టీడీపీ వర్గాలు మాత్రం చంద్రబాబు అనుకూలంగా తీర్పు వెలువడుతుందన్న ఆశాభావంతో ఉండగా, వైసీపీ వర్గాలు మాత్రం స్పష్టమైన తీర్పు ఇవ్వకుండా రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసు విచారణను పంపే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే .. 17ఏ చట్టబద్దతపైనే సుప్రీం కోర్టులోనే మరో కేసు విచారణ దశలో ఉంది. 17ఏ చట్టబద్దత అంశంపై తేలకుండా ఈ కేసులో తీర్పు ఎలా వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి దావోస్ కు..