సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయంగా శతృవులు. కానీ ఓ రకంగా బంధువులు. అందుకే ఈ సందర్భంలో బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు విజయసాయిరెడ్డి. విషయంలోకి వెళితే.. ఇటీవల కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న నందమూరి తారకరత్న హార్ట్ స్ట్రోక్ కు గురై అస్వస్థత పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలకృష్ణకు తారకరత్న సోదరుడి కుమారుడు. దీంతో తారకరత్నను ఆసుపత్రిలో చేర్చిన నాటి నుండి నందమూరి బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
YCP MP Vijaya sai Reddyఇది ఇలా ఉండగా, నందమూరి తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి తనకు దగ్గరి బంధువు కావడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి .. తారకరత్నను చూసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు బుధవారం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తారకరత్న సతీమణి అలేఖ్యరెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. తదుపరి విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
45 నిమిషాలు గుండె ఆగిపోవడంతో మెదడు పై భాగం దెబ్బతిన్నదనీ, దాని వల్ల మెదడులో నీరు చేరి వాచిందన్నారు. వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని వైద్యులు తెలిపారన్నారు. తారకరత్న గుండె బాగానే పని చేస్తుందని, త్వరలోనే కోలుకుంటారని విజయసాయిరెడ్డి అన్నారు. వైద్యులు అధ్బుతమైన చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంలోనే నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. తారకరత్న కు సంబంధించి అన్ని విషయాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.