ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ నేతలపై సైతం టీడీపీ నేతలు కామెంట్ల పరంపర కొనసాగిస్తుంటారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మినబంటు విజయసాయిరెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయం కోరిన హిందువులను నిర్బంధించి,అన్యమత అధికారులకు పెత్తనం కట్టబెడుతన్నదని రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
విజయసాయిరెడ్డి కలకలం …
రామతీర్థంలో శ్రీరాముని తల నరికి వేసిన సంఘటనలో ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన టీడీపీ నేత ఆరోపించారు. రామతీర్థంలో సంఘటన జరిగిన నాలుగు రోజులు పట్టించుకోని ప్రభుత్వం ఈ నెల రెండవ తేదీన తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటించడానికి సిద్దపడగానే వైఎస్ఆర్సీపీ ఆందోళన చెందిందని తెలిపారు. అందకే ఆ రోజు చంద్రబాబు కంటే ముందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొండపైకి వెళ్ళి సాక్ష్యాలు చెరిపి వేశారని తెలిపారు. చంద్రబాబుకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారని, తీరా కొండపైకి వెళ్లిన తరువాత గుడి తలుపులు మూసేశారని చెప్పారు.
మతం పేరుతో…..
రామతీర్థం ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు కోరితే సిఐడి విచారణకుఆదేశించి అన్య మతస్తుడైన ఎడిజి సునీల్ కుమార్ ను దర్యాప్తు అధికారిగా నియమించారని చెప్పారు. మంగళవారం సంఘటన స్ధలంలో పర్యటించిన సునీల్ కుమార్ విగ్రహ విధ్వంసం పక్కా ప్రణాళికతో జరిగిందని చెప్పడం గమనార్హం అన్నారు. దీనిని బట్టి ఈ కేసును తప్పదారి పట్టించి రాజకీయ రంగు పూసే ప్రయత్నం జరుగుతున్నదని భావించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి రిపోర్టునే సునీల్ కుమార్ దర్యాప్తు రిపోర్టుగా కోర్టుకు సమర్పిస్తారని చెప్పారు. కాగా మంగళవారం బిజెపి నేతలు , స్వాములను కొండపైకి వెళ్ళకుండా నిర్బంధించడంలోను కుట్ర దాగివుందన్నారు. ఎంపి విజయసాయి రెడ్డిని కొండపైన, గుడిలో యధేచ్ఛగా తిరగనిచ్చిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబును గుడిలోకి, మిగిలిన వారిని కొండపైకి అనుమతించక పోవడమం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.