విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాజ గురువుగా అభివర్ణించవచ్చు. ఇక తెలంగాణ సీఎం కేసిఆర్ కూడా ఆ స్వామిజీకి భక్తుడే. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు ఆ స్వామిజీ ఆశీస్సులు అందుకుంటున్న వాళ్లే. అయితే ఇప్పుడు ఆ స్వామిజీ తెలుగు రాష్ట్రాల పాలకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ అనే నాస్తికుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ స్పందించారు.
సమజాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు
దేశంలో అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప దేవాలయం ప్రధానమైనదని స్వామిజీ అన్నారు. హిందూ జాతిని మేల్కొలిపే ప్రముఖ ఆలయాల్లో అయ్యప్ప ఆలయం ఒకటని పేర్కొన్నారు. అలాంటి అయ్యప్ప స్వామిపై విదేశీ మతాలకు అమ్ముడుపోయే వ్యక్తులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతిస్తూ సమాజాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. హిందూ దేవతలపై దూషణలు జరుగుతున్నా ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించడం లేదని స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు.
హిందువులు కూడా ఓటర్లే అన్న విషయాన్ని గుర్తించాలి
హిందూ దేవతలపై జరుగుతున్న దూకషణలను అంత ఈజీగా తీసుకోవద్దనీ, ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని సూచించారు. కేవలం మైనార్టీలే కాకుండా హిందువులు కూడా ఓటర్లే అనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. హిందూ దేవతలను, హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడే వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. వారిపై కఠిన సెక్షన్ల తో కేసులు నమోదు చేసి జైలులో కుక్కాలని అన్నారు. భవిష్యత్తులో ఇాలాంటి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని ఆయన కోరారు.