YSRCP – TDP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ప్రాతినిద్యం వహిస్తున్న పెనమలూరు ఇన్ చార్జిగా మంత్రి జోగి రమేష్ ను పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పార్టీ పెద్దలు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆయన పార్టీ మార్పునకు సిద్దమైనట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇవేళ సాయంత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఆయన కలవనున్నారని తెలుస్తొంది.
రీసెంట్ గా పార్ధసారధి తన అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించారు. తన నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు పోటీ చేసినా ఆదరిస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే తనను గుర్తించలేదని వ్యాఖ్యానించారు. ఇవేళ లోకేష్ తో జరిగే చర్చల అనంతరం టీడీపీలో చేరే అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
కాగా పెనమలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు పార్థసారథి ని కోరగా, ఆయన అందుకు అంగీకరించలేదు. ఎంపీగా గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకుంటారని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. దీంతో పార్థసారథి పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ తరుణంలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో.. పార్థసారథి క్యాంప్ ఆఫీస్కు వెళ్లగా, సమన్వయకర్తలు అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్ లు మచిలీపట్నం వెళ్లేందుకు అంగీకరించాలని కోరారు. అయితే మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని, పెనమలూరు నుండే తాను పోటీ చేస్తానని పార్థసారథి పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తొంది. అయితే పెనమలూరు టికెట్ పై టీడీపీ హామీ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పెనమలూరు టీడీపీ ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే బొడె ప్రసాద్ ఉన్నారు.
దివంగత మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన కొలుసు పార్ధసారధి 2004లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉయ్యూరు నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009 లో పెనమలూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 కు ముందు వైసీపీలో చేరారు పార్ధసారధి. 2014 లో వైసీపీ అభ్యర్ధిగా మచిలీపట్నం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత పెనమలూరు ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టిన పార్ధసారధి 2019 ఎన్నికల్లో మరో సారి గెలిచారు.
YS Jagan: వైఎస్ఆర్ సీపీలో బీసీ నేతలకు పెద్ద పీట