YSRCP: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన నూతన కేబినెట్ ను ప్రకటించారు. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విదంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కులాల ఈక్వేషన్ లో కొందరు ఆశావహులకు అవకాశం కల్పించలేకపోయారు. దీంతో సహజంగానే మంత్రి పదవులు ఆశించిన వారిలో కొంత అసంతృప్తి ఉంటుంది. తమ అభిమాన నాయకుడికి మంత్రి వర్గంలో అవకాశం దక్కకపోవడంతో క్యాడర్ ఆందోళన చెందుతుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినంత మాత్రాన వీళ్లు పార్టీ నుండి బయటకు వెళ్లి ప్రత్యర్ధి పార్టీలో చేరే పరిస్థితి లేదు. నిన్న మొన్నటి వరకూ తిట్టిన పార్టీ నాయకులతో కలిసి స్నేహం చేసే అవకాశం కూడా ఉండదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ నాయకులను పిలిచి మాట్లాడి పార్టీలోనో, ప్రభుత్వంలోనో మంచి పదవి ఇస్తాననీ, ప్రోటోకాల్ తగ్గకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే పార్టీలో అసంతృప్తి టీ కప్పులో తుఫానులా ఆవిరి అవుతుంది.
YSRCP: వైసీపీ నిరసన జ్వాలలు అంటూ
ప్రస్తుతం మంత్రి వర్గంలో చోటు లభించకపోవడంతో రాజీనామా చేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఆయా నేతల అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకు ముందు వైసీపీ నేతలు చేసే ఆందోళనలు, దర్నాలు టీడీపీ అనుకూల మీడియాలో పెద్దగా వచ్చేవి కావు. కేవలం సాక్షి లోనే వైసీపీ నేతల వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇప్పుడు వైసీపీ శ్రేణుల ఆందోళనలు సాక్షిలో కనిపించడం లేదు. కానీ మంచి స్టఫ్ దొరికినట్లు టీడీపీ అనుకూల మీడియా వైసీపీ కార్యకర్తల ఆందోళనలు హైలెట్ చేస్తున్నాయి. వైసీపీ నిరసన జ్వాలలు అంటూ ఆయా నాయకుల అభిమానులు, కార్యకర్తలు చేస్తున్న ధర్నాలు, రాస్తారోకోలను టీడీపీ అనుకూల మీడియా హైలెట్ చేస్తోంది. మంత్రివర్గంలో చోటు లభించిన నేతల అభిమానులు, ఆయా వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ జగన్మోహనరెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న వార్తలు మాత్రం సాక్షిలో ఇస్తుండగా వీటిని టీడీపీ అనుకూల మీడియాలో మచ్చుకైనా చూపడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు జగన్ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హర్షాతిరేకాలను సాక్షి హైలెట్ చేస్తోంది.