YSRCP: ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ సీపీ వ్యూహాలను రచిస్తొంది. పార్టీల నేతలు వరుసగా పర్యటనలు, యాత్రల పేరుతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్దం చేసింది పార్టీ. ఈ క్రమంలో భాగంగా బస్సు యాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. ఇటీవల వైసీపీ నేతలతో చర్చించిన సీఎం వైఎస్ జగన్.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వైసీపీ సామాజిక న్యాయ యాత్ర కు సంబంధించి షెడ్యుల్ ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
ఈ నెల 26 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకే సారి బస్సు యాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా మూడు బస్సులను రెడీ చేశారు. బస్సుల ముందు భాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాను ప్రముఖంగా కనిపించేలా స్టిక్కరింగ్ చేశారు. వై భాగాన సామాజిక సాధికార యాత్ర పేరు కనపడేలా చేశారు. ఇక మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వ ఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రముఖుల ఫోటోలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఇక బస్సు యాత్రలు తొలి రోజు అంటే ఈ నెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాల్లో ప్రారంభం కాబోతున్నాయి.
ఉత్తరాంధ్రకు సంబంధించి 26వ తేదీ ఇచ్చాపురంలో బస్సు యాత్ర ప్రారంభం కానుండగా, 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న శృంగవరపుకోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది.
ఇక కోస్తాంధ్రలో 26న తెనాలిలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర 27న నరసాపురం, 28న చీరాల, 30న దెందులూరు, 31న నందిగామ, నవంబర్ 1న కొత్తపేట, 2న ఆవినగడ్డ, 3న కాకినాడ రూరల్, 4న గుంటూరు తూర్పు, 6న వినుకొండ, 8న పాలకొల్లు, 9న పామర్రు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది.
రాయలసీమ విషయానికి వస్తే తొలుత ఈ నెల 26న సింగనమల నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రారంభమై 27న తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30న ఉదయగిరి, 31న ఆదోని, నవంబర్ 1న కనిగిరి, 2న చిత్తూరు, 3న శ్రీకాళహస్తి, 4న ధర్మవరం, 6న మార్కాపురం, 7న ఆళ్లగడ్డ, 8న నెల్లూరు రూరల్, 9న తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగేలా రూట్ మాప్ సిద్దం చేశారు.
ఇలా 60 రోజుల పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రతి రోజు బస్సు యాత్ర సభలు జరుగుతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరించడమే ఈ యాత్ర ఉద్దేశం. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ బస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాం లకు బస్సు యాత్రల నిర్వహణ సమన్వయ బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు.
Roja Ambati: జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంపై మంత్రులు రోజా, అంబటి విమర్శలు ఇలా..