YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళన జరిగింది. కొడాలి నాని ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటే ఆయనను ఆ బాధ్యతల నుండి పక్కకు పెట్టారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ..ఒక జిల్లాకు అధ్యక్షుడుగా ఉంటే ఆయనను రాష్ట్ర స్థాయిలో అనుబంధ విభాగాలకు సమన్వయకర్తగా నియమించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంతకు ముందు తన సొంత జిల్లా ప్రకారంతో పాటు పక్కన ఉన్న జిల్లాకు పెత్తనం వహించి ప్రాంతీయ సమన్వయకర్తగా ఉండగా, ఆయనకు సొంత జిల్లాతో సంబంధం లేని వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. నెల్లూరు జిల్లాను సమన్వయ బాధ్యతలను ఆయన వద్దనే ఉంచారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న బాలనాగిరెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న మేకతోటి సుచరిత ఆ పదవుల నుండి తప్పుకోగా, వేరే వాళ్లను నియమించారు. అదే విధంగా అవంతి శ్రీనివాస్ సమన్వయకర్తగా ఉన్న విశాఖపట్నం జిల్లాకు వెళ్లే వాళ్లను నియమించారు. ఇలా ఎనిమిది జిల్లాల్లో అధ్యక్షులు మారారు. కొన్ని చోట్ల ప్రాంతీయ సమన్వయకర్తలు మారారు. ఇందుకు కారణాలు ఏమిటి..? అనే విషయాలను పరిశీలిద్దాం.!
రీజనల్ కోఆర్డినేటర్ ల విషయానికి వస్తే .. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు మంత్రి బొత్స సత్యనారాయణ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఇక్కడ మార్పు ఏమీ లేదు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. ఇక్కడా మార్పు ఏమీలేదు. తూర్పు గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి లు కొనసాగుతున్నారు. కొడాలి నాని వద్దనున్న పల్నాడు బాధ్యతలను భూమన కరుణాకర్ రెడ్డికి, గుంటూరు జిల్లా బాధ్యతలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్ కు అప్పగిస్తూ, ఈ మూడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మర్రితో పాటు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కొత్తగా బాధ్యతలు ఇచ్చారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్ గా బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి నియమితులైయ్యారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఇంతకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులైయ్యారు. ఆయన సొంత జిల్లా ప్రకాశం, బాపట్ల జిల్లాలను ఆయన నుండి తొలగించారు. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ప్రాంతీయ సమన్వయకర్తగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించగా, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రాంతీయ సమన్వకర్తగా ఆకేపాటి అమరనాథ్ రెడ్డిని నియమించారు. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిలను కూడా ప్రాంతీయ సమన్వయ కర్త బాధ్యతల నుండి తప్పించారు.
YSRCP: జిల్లా అధ్యక్షులు
- శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాసు (మార్పులేదు)
- విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
- పార్వతీపురం మన్యం – పరీక్షిత్ రాజు (పుష్పశ్రీవాణి ఉండేవారు)
- అల్లూరి సీతారామరాజు – కోటగుళ్ల భాగ్యలక్ష్మి
- విశాఖపట్నం – మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ (అవంతి శ్రీనివాస్ ను తప్పించారు)
- అనకాపల్లి – కరణం ధర్మశ్రీ
- కాకినాడ – కురసాల కన్నబాబు
- కోనసీమ – పొన్నాడ వెంకట సతీష్ కుమార్
- తూర్పు గోదావరి – జక్కంపూడి రాజా
- పశ్చిమ గోదావరి – చెరుకువాడ శ్రీరంగనాధరాజు
- ఏలూరు – ఆళ్ల నాని
- కృష్ణా – పేర్ని నాని
- ఎన్టీఆర్ – వెల్లంపల్లి శ్రీనివాస్
- గుంటూరు – డొక్కా మాణిక్య వరప్రసాద్ (మేకతోటి సుచరిత తప్పుకున్నారు)
- బాపట్ల – మోపిదేవి వెంకటరమణ
- పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
- ప్రకాశం – జంకె వెంకట రెడ్డి (కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ ను తప్పించారు)
- నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
- కర్నూలు – బీవై రామయ్య (మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉండేవారు)
- నంద్యాల – కాటసాని రాంభూపాల్ రెడ్డి
- అనంతపురం – పైలా నరసింహయ్య
- శ్రీ సత్యసాయి జిల్లా – శంకరనారాయణ
- వైఎస్ఆర్ కడప – కొట్టమద్ది సురేష్ బాబు
- అన్నమయ్య – గడికోట శ్రీకాంత్ రెడ్డి
- చిత్తూరు – నారాయణస్వామి
- తిరుపతి – నెదురుమల్లి రామ్ కుమర్ రెడ్డి
ఇలా మార్పులు చేర్పులు జరిగాయి, మొత్తానికి 8 జిల్లాల అధ్యక్షులు మారారు. ఈ మార్పులు ఎందుకు జరిగాయి..? బాలినేని శ్రీనివాసరెడ్డి మార్పు వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా..? వాస్తవానికి ఆయన సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశం. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు ఆయన ప్రాంతీయ సమన్వయకర్తగా ఉండే వారు. కానీ సొంత జిల్లాలో కొన్ని గ్రూపులు ఎక్కువగా ఉన్నాయనీ, ఆయనకు వ్యతిరేకంగా వివాదాలు, విభేదాలు, వర్గపోరు ఎక్కువగా ఉందని, ఆయన సమన్వయం చేయడంలో విఫలమయ్యారని ఫిర్యాదులు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పాటు వైవీ సుబ్బారెడ్డితో గ్యాప్స్ ఉన్న కారణంగా ఆయనను సొంత జిల్లాల నుండి తప్పించి వేరే జిల్లాలు ఇచ్చారు. కొడాలి నాని విషయానికి వస్తే .. ఆయన పార్టీ పరంగా వైఎస్ జగన్మోహనరెడ్డికి వీర విధేయుడు. కానీ తనకు ఇచ్చిన బాధ్యతల్లో ఫెయిల్ అయ్యారని పార్టీ భావించిందేమో కానీ ఆయనను పక్కన పెట్టారు. ఆయనతో పాటు అనిల్ కుమార్ యావద్ ను పక్కన పెట్టారు. ప్రాంతీయ సమన్వయకర్తల విషయంలో కొంత మంది వేటు పడింది. కొంత మందికి బదిలీ వేటు పడింది. చెవిరెడ్డి భాస్కరరాడ్డికి ప్రమోషన్ దక్కింది. గ్రూపులు ఉండకూడదు. వర్గాలు ఉండకూడదు, విభేదాలు, వివాదాలు ఉండకూడదు, గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పని చేయడానికి ఈ ప్రక్షాళన చేశారు అని అనుకోవచ్చు.