YSRCP: నూతన మంత్రి వర్గంలో స్థానం లభించకపోవడంతో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వారి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. అసంతృప్తి నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణలు చర్చలు జరిపినా వారిలో అసంతృప్తి పోలేదు, చివరకు ఆయా నేతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలిపించి మాట్లాడటంతో వ్యవహారం అంతా టీకప్పులో తుఫానులా చల్లారిపోయింది. తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో నిన్న సీఎం వైఎస్ జగన్ మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎంతో భేటీ అనంతరం తనకు ఎటువంటి అసంతృప్తి లేదనీ బాలినేని పేర్కొన్నారు. అదే విధంగా ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభాను తదితర అసంతృప్తి నేతలతోనూ జగన్ భేటీ అయ్యారు. సామాజిక సమీకరణాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయామని, పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవించడం జరుగుతుంది హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకుని 2024 లో అధికారంలోకి తేవాలని సీఎం జగన్ వారికి సూచించారు.
YSRCP: బాధకల్గించింది కానీ..
సీఎం జగన్ తో భేటీ అనంతరం కొందరు నేతలు మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రిపదవి రాకపోవడం తమ కార్యకర్తలను బాధించిందనీ పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యం కల్పించారని అన్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సీఎం కోరారని పార్ధసారధి తెలిపారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు వల్ల తప్పనిసరిగా జిల్లా నుండి మంత్రి పదవి వస్తుందని ఆశించానని అన్నారు. 2012లోనే వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించి పార్టీ బలోపేతం కృషి చేశాననీ, ఆ తరువాత పార్టీలో చేరిన వారికి పదవులు వచ్చాయని నిన్న సామినేని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని గౌరవిస్తామని పేర్కొన్న ఆయన మంత్రి పదవి రాకపోవడంతో బాధపడినట్లు తెలిపారు.
YSRCP: అనారోగ్య పరిస్థితుల వల్లనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
ఇక తాజా మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ ఇవ్వడంతో ఇప్పటి వరకూ సీఎం అపాయింట్మెంట్ ఖరారు కాలేదని సమాచారం. అయితే తనకు మంత్రి పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదని సుచరిత అన్నారు. మంత్రి పదవి రెండున్నరేళ్లు మాత్రమేనని సీఎఁ జగన్ ముందే చెప్పారన్నారు. తమ వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదని, వైసీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదనీ, కానీ కొన్ని కారణాలు బాధ కల్గించాయన్నారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్య పరిస్థితుల వల్లనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా పంపానన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటాననీ, పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు. వైసీపీలో అసంతృప్తి టీకప్పులో తుఫానులా సమసిపోతుందని న్యూస్ ఆర్బిట్ ముందుగానే వార్త ఇచ్చింది.