AP Capitals Bill: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నది ఏదైనా ఉంది అంటే..అది మూడు రాజధానుల అంశం. రీసెంట్గా మూడు రాజధానులకు సంబంధించి గతంలో అమోదించి చట్టం అయిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం ఉప సంహరించుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును డ్రాప్ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో మళ్లీ మెరుగైన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకురానున్నట్లు చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. దీంతో సీఎం జగన్మోహనరెడ్డి ఈ కొత్త బిల్లు ఎప్పుడు తీసుకురానున్నారు ? ఇది ఎలా ఉంటుంది ? రాజధాని అంశాల్లో ఏమైనా మారుస్తున్నారా ? న్యాయపరంగా చిక్కులను ఎలా అధిగమిస్తారు ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగానూ ఉంది. అయితే రాజధానులకు సంబంధించి జగన్మోహనరెడ్డి ఏ విదంగా ఆలోచన చేస్తున్నారు ?. త్వరలో తీసుకురానున్న బిల్లులోని అంశాలు ఏ విధంగా ఉండనున్నాయి ? అనేది ‘న్యూస్ ఆర్బిట్’కు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఏమిటంటే.. త్వరలో తీసుకురానున్న పరిపాలనా వికేంద్రీకణ బిల్లుకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలన్నది ప్రభుత్వ ప్రధమ లక్ష్యంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ విధాన నిర్ణయాలపై హైకోర్టు ఆక్షేపించడం, తప్పుబట్టడం జరుగుతున్న నేపథ్యంలో ఏ చిన్న లిటిగేషన్ లేకుండా బిల్లు ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
AP Capitals Bill: అమరావతిలో న్యాయ రాజధాని..!?
అందులో భాగంగా మొట్టమొదటిది న్యాయ రాజధాని జోలికి పోకుండా ఉండటం. హైకోర్టును కర్నూలుకు మార్పు చేయాలంటే కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ హైకోర్టు మార్పునకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతి అవసరం. ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపితేనే హైకోర్టు మార్పునకు మార్గం సుగమం అవుతుంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధిస్తుందా లేదా అన్న అనుమానం ఉన్న కారణంగా అమరావతిలోనే హైకోర్టు (న్యాయరాజధానిధి) ని ఉంచే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇక అమరావతిలో ఉన్న శాసన రాజధానిని కర్నూలుకు మార్పు చేసే అవకాశం ఉంది. ఈ మార్పులు చేయడం వల్ల న్యాయస్థానం నుండి ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు రాకపోవచ్చని జగన్ సర్కార్ భావిస్తోందట. ఇక పరిపాలనా రాజధానిగా విశాఖను ముందు అనుకున్నట్లుగా నిర్ణయించడం అనేది మొదటి ప్రతిపాదన.
ఈ నిర్ణయాన్ని ఎవరూ తప్పుబట్టకుండా ఉండేందుకు గానూ ప్రభుత్వం ముందుచూపుతో ప్రజాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం ఇది అన్నట్లు చూపేందుకు స్థానిక సంస్థల ద్వారా తీర్మానాలు ఆమోదించుకుని తెప్పించుకోవాలని ఆలోచన చేస్తుందట. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపల్ కార్పోరేషన్ల ద్వారా మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేయించి ఆ తీర్మానాలను ప్రభుత్వం వద్ద పెట్టుకుంటుంది. ఆ తరువాత కేబినెట్ లో ఆమోదించి ఉభయ సభల్లో ఆ బిల్లును పాస్ చేయించుకుని గవర్నర్ ఆమోదంతో చట్టంగా చేయాలన్నది జగన్ సర్కార్ ఆలోచన. ఇలా చేయడం వల్ల ప్రజాభిప్రాయం మేరకు తీసుకున్న నిర్ణయంగా దీనికి బలం చేకూరుతుంది.
రైతులతో చర్చలు..!?
ఇక ఇదే క్రమంలో అసెంబ్లీలో బిల్లు తీసుకురాకముందే రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతు వర్గాలతో చర్చలు జరిపి వారి ఆందోళన విరమింపజేయాలన్నది. వాళ్లను నయానో బయానో ఒప్పించేందుకు ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు. రెండవ వర్గం రైతుల నుండి భూములు కొనుగోలు చేసి రాజధానికి ఇచ్చిన పెట్టుబడిదారులు, వీళ్ల ఆందోళనకు మద్దతుదారులు ఉన్న మూడో వర్గం. ఈ మూడు వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా ఒక పరిష్కారం కనుగొనడం. భూములు ఇచ్చిన రైతులకు ఒన్ టైమ్ సెటిల్మెంట్ లేదా వాళ్ల భూములను వాళ్లకు తిరిగి ఇవ్వడంతో పాటు కొంత పరిహారం ఇచ్చి వాళ్లందరినీ ఒప్పించాలని చూస్తోందట. రైతులతో ఇబ్బందులు లేకుండా చూసుకోవడం, స్థానిక సంస్థల ద్వారా తీర్మానాలు చేయించి ప్రజాభిప్రాయంగా చూపించడం, న్యాయ పరమైన చిక్కులు రాకుండా న్యాయస్థానాన్ని అమరావతిలో ఉంచడం ఇలా మూడు అంశాలను పకడ్బందీగా తీసుకుని ముందుకు సాగాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగుస్తున్నందున మార్చి, ఏప్రిల్ నెలలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో నూతన బిల్లును తీసుకురానున్నదనీ, ఈ నాలుగైదు నెలల్లో ఈ కీలక పరిణామాలు అన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని సమాచారం. గతంలో జరిగిన తప్పులు లాంటివి లేకుండా ఇప్పుడు న్యాయనిపుణులతో ముందుగా చర్చించి మెరుగైన రీతిలో పరిపాలనా వికేంద్రీకణ తీసుకువచ్చేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారుట.