అవసరాలు మనుషులనే మారుస్తాయి. రాజకీయులను మార్చడం ఓ లెక్కా..!?
“టైం” మనుషులనే మారుస్తుంది. రాజకీయాలను మార్చడం ఓ లెక్కా..!?
ఇప్పుడు ఆ అవసరం.., ఆ టైం.. ఇద్దరు చంద్రులకు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కలయికకు మూహూర్తం ఫిక్స్ అయిందంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇప్పుడు సర్వదా.., శతధా.., సహస్రధా సంచలనాంశమే..! ఆ అవసరం ఏమిటో.., ఆ టైం ఏమిటో.., ఆ సంచలన సందర్భం ఏమిటో చూద్దాం..!!
ఈ కలయిక కారణాలు మూడు..!!
చంద్రబాబు అవసరం కేసీఆర్ కి ఏమొచ్చింది..? కయ్యానికి కాలు దువ్వుకున్న ఈ ఇద్దరికీ ఇప్పుడు మళ్ళీ కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? అనేదే అందరి మదిలో మెదిలే అనుమానాలు. అందుకు కేసీఆర్ కి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకి అనేక కారణాలున్నాయి.
* జగన్ కేసీఆర్ కి దెబ్బ వేశారు. గత ఏడాది ఎన్నికల్లో పరోక్షంగా జగన్ విజయానికి కేసీఆర్ కొంతమేరకు సాయం చేశారు. చంద్రబాబుపై కోపంతో ఓ దశలో టీడీపీ ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టారు. దీంతో టీడీపీ అనుకున్నంతగా ఖర్చు చేయలేక చాలా నియోజకవర్గాల్లో చేతులెత్తేసింది. తాను జగన్ కి అంతగా సాయం చేస్తే.. ఇప్పుడు జగన్ కేసీఆర్ మాట అసలు పట్టించుకోవట్లేదు. బీజేపీ భజనలో ఆరితేరుతున్నాడు. జగన్ ని, స్టాలిన్ ని, కేజ్రీవాల్ ని, నవీన్ పట్నాయక్ ని, మమతా బెనర్జీని కలుపుకుని తాను బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో చక్రం తిప్పాలి అనుకుంటే జగన్ తోక జాడించడం కేసీఆర్ కి నచ్చడం లేదు. అందుకే పరోక్షంగా జగన్ పై, ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రుల మాటల దాడి ఆరంభమయింది. అందుకే తన తోటి తెలుగు రాష్ట్రంలో ఒకరి తోడు ఉంటె బాగుంటుంది అనుకుంటున్న కేసీఆర్ కి జగన్ కంటే చంద్రబాబు కాస్త నయం అనిపిస్తుందట..!
* కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలి అనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలకు వెళ్లాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో, నేతలను సంప్రదింపుల్లో బాగా సీనియారిటీ ఉన్న చంద్రబాబు కేసీఆర్ కి అవసరమే. చంద్రబాబుకి మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, ఫరూక్ వంటి నేతలతో మంచి పరిచయాలున్నాయి. చంద్రబాబు కి ఏపీ చాలు. అందుకే కేసీఆర్ కి జాతీయ స్థాయిలో చంద్రబాబు పోటీ కాబోరు. ఈ ఆలోచనతో కేసీఆర్ మళ్ళీ చంద్రబాబుతో జత కట్టే సూచనలకు సంకేతాలు..!
* ఇకపోతే… త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. గ్రేటర్ లో టీడీపీకి, చంద్రబాబుకి కొంత మేరకు పట్టుంది. వారు సొంతంగా కార్పొరేటర్ సీట్లు గెలిచేంతగా కాకపోయినా దాదాపు 50 డివిజన్లలో గెలుపుని శాసించగలరు. కూకట్ పల్లి, సనత్ నగర్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్ , కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ జెండాలు ఇప్పటికీ ఎగురుతుంటాయి. గ్రేటర్ లో టీఆరెస్ కి బీజేపీ రూపంలో ముప్పు ఉంది. మేయర్ పీఠానికి ఏమాత్రం డోకా లేకుండా ఉండేందుకు, భావి అవసరాల దృష్ట్యా గ్రేటర్ లో టీడీపీ క్యాడర్ ని పూర్తిగా టీఆరెస్ కి మళ్ళాలి అంటే చంద్రబాబుతో కయ్యం ఇంకా కొనసాగించకూడదు అనేది కేసీఆర్ ఆలోచనట..! ఇలా ప్రధాన మూడు కారణాలతో పాటూ ఇతర కొన్ని సున్నిత అంశాల ఆధారంగా ఇద్దరి కలయికని కొందరు నేతలు కోరుకుంటున్నారట. అందుకే త్వరలోనే ఈ ఇద్దరి భేటీ జరిగినా ఆశ్చర్యం లేదు. ముందే చెప్పుకున్నాంగా..! అవసరాలు మనుషులనే మారుస్తాయి. రాజకీయులను మార్చడం ఓ లెక్కా..!? “టైం” మనుషులనే మారుస్తుంది. రాజకీయాలను మార్చడం ఓ లెక్కా..!?