కర్మసిద్ధాంతం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు, రాశుల ఫలాలు మానవుడి మీద ఉంటాయి. అయితే జీవితంలో ఆయా సందర్భంలో వాటి అనుకూలత కోసం రకరకాల పూజలు చేయాలి. అయితే జన్మరాశుల ప్రకారం ఎవరు ఏ దేవుడిని పూజించాలి, ఎలా పూజించాలో పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకుందాం…
మేష రాశి : పౌర్ణమి రోజున పార్వతి, దుర్గా, శక్తి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించాలి. శక్తి మేరకు శక్తిపీఠాల దర్శనం చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో జోగులాంబ, శ్రీశైలంలో శక్తిపీఠాలు ఉన్నాయి. వీటితోపాటు విజయవాడ కనగకదుర్గా, తిరుచనారు శ్రీ పద్మావతి దేవాలయం, బాసర సరస్వతి, వరంగల్ భద్రకాళి దేవాలయం దర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.
వృషభ రాశి : ప్రతి శుక్రవారం లేదా నెలలో ఎదో ఒక శుక్రవారం రోజున గోమాతకు ఏదైనా తినిపించి, శ్రీమహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శ్రీసూక్తపారాయణం, దుర్గా సూక్తం పారాయణం చేయాలి. గోమాతకి ఏదైనా తినిపించిన తరువాత ఇంట్లోనే శ్రీమహాలక్ష్మీదేవి అష్టకం పఠించాలి.
కర్కాటక రాశి : ప్రతి నెలా వచ్చే త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి నువ్వులనూనెతో దీపం వెలిగించాలి మరియు రుద్రాభిషేకం చేయించాలి. శివకవచం, శివాష్టోతర పారాయణం మంచి ఫలితాలను ఇస్తుంది.
మిథున రాశి: ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి విష్ణాలయం దర్శించుకోవాలి. శ్రవణ నక్షత్రం రోజు వేంకటేశ్వరస్వామి ఆరాధన లేదా దేవాలయం దర్శనం చేయడం మంచిది. శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయానికి వెళ్ళి సామూహిక సత్యనారాయణవ్రతం చేసుకోవాలి.
సింహ రాశి : ప్రతినెలా ఒక రోజు శ్రీరామాలయానికి లేదా శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించిన తరువాత తులసిదళంతో అర్చన చేసుకోవాలి. రామరక్షాస్తోత్రం పారాయణం చేయాలి.
కన్యా రాశి : ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాత ఆవునేతితో దీపం వెలిగించాలి. దుర్గాష్టకం పారాయణం చేయాలి.
తులా రాశి : ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజున విష్ణాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించి తులసిదళంతో అర్చన చేయాలి. లేదా మారేడుదళాలలతో అర్చించాలి.
వృశ్చిక రాశి: నెలలో ఎదో ఒక రోజున దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి ఎర్ర గన్నేరుపువ్వులు లేదా అందజేసి ఆవునేతితో దీపం వెలిగించాలి. ప్రతి రోజూ దుర్గా అష్టోత్తరం పఠించాలి. లేదా కనీసం వినడం అయినా చేయాలి.
ధనుస్సు రాశి : నెలలో ఏదో ఒక రోజు నృసింహస్వామి దేవాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించాలి. శ్రీ నృసింహస్వామి దేవాలయంలో దీపారాధనకు ఆవునెయ్యిని దానంగా ఇవ్వాలి. నరసింహ కరావలంబాన్ని పారాయణం చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.
మకర రాశి : ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజున రాహుకాలంలో శివాలయానికి వెళ్ళి నువ్వులనూనెతో దీపం వెలిగించి, బిల్వదళం సమర్పించాలి. బిల్వాష్టకం పఠించాలి శివపంచాక్షరి జపం మంచి ఫలితాన్నిస్తుంది.
కుంభ రాశి : త్రయోదశి రోజున దుర్గాదేవి ఆలయానికి లేదా కాలభైరవ దేవాలయానికి వెళ్ళి నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. అలాగే దేవాలయంలో దీపం వెలిగించడానికి నువ్వులనూనెను దానంగా ఇవ్వాలి. మందిరంలో నల్లకుక్క లేదా నల్లఆవుకి ఏదైనా తినే పదార్థాన్ని పెట్టాలి.
మీన రాశి : ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి. అనంతరం ఐదు ప్రదక్షిణాలు చేసిన తరువాత దేవాలయంలో ఉన్న రావిచెట్టుకి కూడా ఐదు ప్రదక్షిణాలు చేయాలి. దత్తాత్రేయ వజ్రకవచం పారాయణం లేదా వినడం మంచి ఫలితాన్నిస్తుంది.