YSRCP Survey: ఏపిలోని అధికార వైసీపీ కొన్ని జిల్లాలపై స్పెషల్ పోకస్ పెట్టింది. ఆ జిల్లాల్లో సర్వేలు కూడా చేస్తోంది. ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక టీమ్ని పంపించి కావచ్చు సర్వే జరుగుతోంది. పది రోజుల నుండి ఇది జరుగుతోంది. ఉదాహరణకు చెప్పుకుంటే.. శ్రీకాకుళం జిల్లాలో నాలుగైదు రోజుల నుండి ప్రజలకు ఫోన్ లు వెళుతున్నాయి. ఆముదాలవలస, శ్రీకాకుళం, నర్సన్నపేట, పాతపట్నం, పాలకొండ, రాజాం తదితర నియోజకవర్గాలోని కొంత మందికి ఫోన్ లు వెళుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరపాలన ఎలా ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా..? లేదా, సంక్షేమ పథకాలు ఏమైనా అందకపోతే ఫలానా నెంబర్ కు ఫిర్యాదు చేయండి. సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ఎవరైనా లంచాలు అడుగుతున్నారా..? మీ వాలంటీర్, మీ సచివాలయ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటున్నారా..? అలాగే మీ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది..? మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారా..? లాంటి ప్రశ్నలతో శ్రీకాకుళం జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో కొంత మందికి ఫోన్ లు వెళుతున్నాయి. అయితే ఒక ప్రైవేటు నెంబర్ నుండి కాల్స్ వెళుతున్నాయి కానీ వైసీపీ చేయిస్తుంది అని భావించవచ్చు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ అవసరం వచ్చింది..? అనే విషయం చెప్పుకుంటే..
YSRCP Survey: ఎమ్మెల్యేల పనితీరుపైనా..
శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలోనూ, రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా సర్వే జరుగుతోంది. ఎందుకు అంటే..త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ ప్రక్షాళన చేయనున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం దృష్టి పెట్టారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలంటే ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకోవాల్సి ఉంది. చాలా మంది ఆశావహులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. సిదిలి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్నారు. తమ్మినేని సీతారాం కూడా కేబినెట్ లోకి రావాలని చూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికలో రాజాం ఎమ్మెల్యే కంభాల జోగులు కూడా మంత్రిపదవిపై ఆశపెట్టుకున్నారు. ఈయన కూడా సీనియర్ నాయకుడు, వరుసగా గెలుస్తున్నారు. ఇలా మంత్రిపదవి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో జక్కంపూడి రాజ, దాడిశెట్టి రాజా, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇలా ఆయా జిల్లాల్లో ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే వాళ్ల పనితీరు ఎలా ఉంది..? అని తెలుసుకునేందుకు వైసీపీ ఈ పని చేపట్టిందని భావిస్తున్నారు.
ప్రభుత్వ, పార్టీ ప్రక్షాళనలో భాగంగా..?
ప్రభుత్వం వాళ్లకు ఉన్న అనేక సోర్సుల ద్వారా సర్వేలు చేయిస్తుంటారు. వైసీపీ ఒక ప్రైవేటు ఏజన్సీ ద్వారా సర్వే చేయిస్తోంది. ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ ద్వారా సర్వే చేయిస్తోంది. సాక్షి మీడియా సిబ్బంది ద్వారా, మరో పక్క ఐవిఆర్ఎస్ (ఫోన్) ద్వారా సర్వే జరుగుతుంటుంది. ప్రభుత్వ పక్షాలు ప్రతి నెలా ఈ సర్వే చేయిస్తూనే ఉంటుంది. వీటన్నింటికి తోడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా సేకరిస్తుంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా సర్వేలు చేయిస్తుండేవాళ్లు. ఐవిఆర్ఎస్, ఇంటెలిజెన్స్ తో పాటు చంద్రబాబు వద్ద మూడు టీమ్ ల ద్వారా కూడా సర్వే చేసి క్రాస్ చెక్ చేసుకునే వారు. ఎవరైనా నాయకుడు ఎదురైతే తన టేబుల్ మీద ఉన్న ఈ రిపోర్టు చూపించేవారు. ఇప్పుడు వైసీపీ మంత్రివర్గ ప్రక్షాళన కోసం ఇది చేపట్టింది. దీనితో పాటు మార్చి నెల నుండి సీఎం జగన్మోహనరెడ్డి జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. కొత్త పథకాలు తీసుకురావాలని అనుకుంటున్నారు. పాత పథకాలను కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నారు. ఇలా చాలా రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు జగన్. ఓ పక్క ప్రభుత్వ ప్రక్షాళన, మరో పక్క పార్టీ ప్రక్షాళన ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ సర్వేలు జరుగుతున్నాయనేది సమాచారం.