Surekha Vani: నటి సురేఖా వాణిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే నటనతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో సురేఖా వాణి మంచి పేరు సంపాదించుకున్నారు. విజయవాడలో పుట్టి పెరిగిన సురేఖా వాణి.. 8వ తరగతిలో ఉన్నప్పుడే యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. విజయవాడలోని ఒక ప్రాంతీయ ఛానెల్ లో పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇంటర్ తర్వాత పూర్తిస్థాయి యాంకర్ గా మారింది.
టీవీ యాంకర్గా ఉన్న సమయంలోనే సురేఖా వాణి సురేష్ తేజతో ప్రేమలో పడింది. సురేష్ తేజ కూడా అనేక తెలుగు టీవీ ప్రొగ్రామ్స్, టీవీ షోలకు డైరెక్టర్గా పని చేశారు. మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి టీవీ షోలు సురేష్ తేజ డైరెక్ట్ చేశారు. ఈ ప్రొగ్రామ్స్కు సురేఖ వాణి యాంకర్గా వ్యవహరించేది. ఆ టైమ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి.. పెళ్లికి దారి తీసింది. వివాహం అనంతరం కూడా భర్త సపోర్ట్ తో సురేఖా వాణి తన కెరీర్ ను కొనసాగించింది.
బుల్లితెర నుంచి వెండితెరపై అడుగు పెట్టి అక్క, వదిన, పిన్ని వంటి సహాయక పాత్రల ద్వారా ప్రేక్షకులకు చేరువైంది. శీనుగాడు చిరంజీవి ఫ్యాన్, భద్ర, బొమ్మరిల్లు, నోట్ బుక్, దుబాయ్ శీను, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, బోణీ, గణేష్, ఓయ్, ఎవరైనా ఎపుడైనా, రాజు మహారాజుతో సహా వందల చిత్రాల్లో సురేఖా వాణి నటించింది. తెరపై పద్ధతిగా కనిపిస్తూ టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది.
అయితే లైఫ్ సాఫీగా సాగుతున్న తరుణంలో సురేఖా వాణి జీవితంలో విషాదం చోటుచేసుకుంది. 2019లో ఆమె భర్త సురేష్ తేజ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. భర్త చనిపోయిన తర్వాత సురేఖా వాణి లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయింది. కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి బట్టలు వేసుకుని పార్టీలు, పబ్బులు, వెకేషన్స్ అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. షార్ట్ డ్రస్ లలో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. అంతేకాకుండా ఎవరైనా నోరు జారి విమర్శిస్తే.. వారికి ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇకపోతే సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోబోతుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని సురేఖా వాణి, సుప్రీత పలు మార్లు ఖండించారు.
అయినాసరే ఆ ప్రచారానికి అడ్డుకట్ట పడటం లేదు. పైగా ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా కూడా సురేఖా వాణిని రెండో పెళ్లి గురించి అడగకుండా వదిలిపెట్టడం లేదు. నచ్చినవాడు దొరికితే పెళ్లి చేసుకోకపోయినా.. డేటింగ్ కి సిద్ధం అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సురేఖా వాణి కుండబద్దలు కొట్టింది. తాజాగా తల్లి పెళ్లి గురించి కూతురు సుప్రీత కూడా మాట్లాడింది. మా అమ్మకు మళ్లీ పెళ్లి చేస్తానని మనసులో మాటను బయటపెట్టేసింది. సురేఖావాణికి రెండో పెళ్లి చేసే ఆలోచన ఉందా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. తనకు ఆ ఆలోచన ఉందని, అయితే అమ్మకు అబ్బాయిలు సెట్ కారని, అంకుల్స్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని సుప్రీత తెలిపింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మను బాగా చూసుకోవాలని, చెడు ఆలోచనలు లేనివాడై ఉండాలని.. అలాంటి వ్యక్తి దొరికితే కచ్చితంగా రెండో పెళ్లి చేస్తానని సుప్రీత పేర్కొంది.