BRS MP: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ లోని కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారు.
తాజాగా ఇవేళ టీ పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డితో కలిసి సీఎం వద్దకు కేకే వెళ్లారు. కాంగ్రెస్ లో చేరతానని కేకే గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో కేకే సమావేశమైయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో లోక్ సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం.
త్వరలో తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కేకే కాంగ్రెస్ లో చేరనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్ధం పుర్చుకోనున్నారని సమాచారం.
ఇటీవల కేశవరావు నివాసానికి వెళ్లిన దీపా దాస్ మున్షీ .. కేకే తో పాటు ఆయన కుమార్తె విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో వీరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం అప్పటి నుండే జరుగుతోంది. తాజాగా గురువారం కేకే తన నిర్ణయాన్ని వెలువరించడంతో అది ఖరారు అయ్యింది.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా కేకే ప్రకటించడానికి ముందు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో సమావేశమైయ్యారు. కేకే పార్టీ వీడుతున్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో కేసిఆర్ ..కేకే ను పిలిపించి మాట్లాడారు. కేకే వ్యవహారాల తీరుపై కేసిఆర్ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. కాగా, కేకే కుమారుడు విప్లవ్ మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని నిన్న ప్రకటించారు.