Congress: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆదాయపన్ను (ఐటీ) అంశంలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీకి మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు.
2017 -18, 2020 -21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులు ఇచ్చినట్లు వివేక్ తంఖా ఆరోపించారు.
ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అని ఆయన మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తొందని దుయ్యబట్టారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుండి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసిన విషయం విదితమే.