Atal Setu: వాణిజ్య రాజధాని ముంబాయి నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (ఎంటీహెచ్ఎల్) ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. 27వ జాతీయ యువజనోత్సం మరియు ముంబాయిలోని అటల్ సేతు ప్రారంభోత్సవానికి గానూ కొద్ది సేపటి క్రితం ప్రధాని మోడీ మహారాష్ట్ర పర్యటనకు విచ్చేశారు.
నీలగిరి హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. తదుపరి ప్రధాని మోడీ అటల్ సేతును ప్రారంభించారు. ఈ అటల్ సేతు ప్రత్యేకతలు ఏమిటంటే.. ముంబాయిలోని సేవ్రీ నుండి రాయగఢ్ జిల్లాలోని సహవా శేవాను కలుపుతూ రూ.17,840 కోట్ల అంచనా వ్యయంతో ఆరు లైన్లుగా నిర్మించారు. 2016 డిసెంబర్ నెలలో ప్రధాని మోడీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్ధం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు.
ముంబాయి, నవీ ముంబాయిల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా, కొత్తగా నిర్మించిన వంతెనతో 15 – 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ వంతెన పొడవు 21.8 కి,మీ కాగా, 16.5 కిలో మీటర్లు అరేబియా సముద్రంపై ఉంటుంది. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనగా గుర్తింపు పొందుతోంది. ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది.
అంతే కాకుండా ముంబాయి నుండి పూణె, గోవా మరియు దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. అలానే ముంబాయి పోర్టు, జవహర్ లాల్ నెహ్రూ పోర్టు మద్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ వంతెనపై ప్రయాణీకుల కారునకు రూ.250లు టోల్ ఫీజుగా నిర్ణయించారు. అయితే తిరుగు ప్రయాణదారులకు, రోజువారీ వాహనదారులకు తగ్గింపు చార్జీలు వసూలు చేస్తారు.
అటల్ సేతులో ఉపయోగించిన లైట్లు జలపర్యావరణానికి భంగం కలిగించవని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. నిపుణులు దీన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తున్నారని పేర్కొన్నారు. అటల్ సేతు నిర్మాణానికి ఉపయోగించిన స్టీల్ ప్యారిస్ లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 17 రెట్లు ఎక్కువ అని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెన నిర్మాణం జరిగిందని చెబుతున్నారు.
అటల్ సేతు నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. వంతెనపై 400 సీసీ టీవీ కెమెరాలు అమర్చారు. ఇవి భద్రతా పరంగా ఎంతో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా అక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్ కు అందిస్తాయి.
శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒక వైపు సౌండ్ బారియర్ ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాట్లు చేశారు. ఈ వంతెన దక్షిణ ముంబాయిలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానె క్రీక్ ను దాటుతుంది.
YSRCP – TDP: పార్టీ మార్పునకు సిద్దమైన మాజీ మంత్రి పార్ధసారధి