PSLV –C58: నూతన సంవత్సరం రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ – సీ 58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. దీంతో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది.
తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి పీఎస్ఎల్వీ – సీ 58 వాహన నౌక ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహంతో సోమవారం ఉదయం 9.10 గంటలకు అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ అనంతరం షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పీఎస్ఎల్వీ రాకెట్ బయలుదేరింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్ పోశాట్ ను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్ పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.
ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కళాశాల విద్యార్ధినులు తయారు చేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అంతరిక్ష రహస్యాల కోసం ఈ ఎక్స్ పోశాట్ ను రూపొందించారు. ఇది టెలిస్కోప్ మాదిరిగా పని చేస్తూ ఖగోళంలోబ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధన చేయనుంది. కాగా ఎక్స్ పోశాట్ జీవిత కాలం అయిదేళ్లు.
ఇస్రో ప్రయోగించిన తొలి పొలారిమెట్రీ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన నాసా 2019 లో చేపట్టిన ఇమేజింగ్ ఎక్స్ కే పోలారిమెట్రీ ఎక్స్ ప్లోరర్ (ఇఎక్స్ పీఈ) తర్వాత మరో దేశం చేపట్టిన పోలారిమెట్రీ మిషన్ ఇదే కావడం గమనార్హం. కాగా ఇస్రో చరిత్రలో ఇప్పటి వరకూ 59 పీఎస్ఎల్వీ ప్రయోగాలు జరిగాయి. ఇది 60వది. పోలార్ శాటిలైట్ లాంచి వెహికల్ ప్రయోగాలు ఇప్పటి వరకు పీఎస్ఎల్వీకి బాగా కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ఏడాది పీఎస్ఎల్వీ ప్రయోగాలతోనే ప్రారంభించడం గమనార్హం.
YSRCP: తండ్రీ తనయుల మధ్య టికెట్ వార్ ..అమలాపురం వైసీపీలో ఆసక్తికరంగా మారిన రాజకీయం