Maharashtra Politics: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. నూతనంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ఈ రోజు అసెంబ్లీ (Assembly) లో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకున్నారు. శివసేనను చీల్చి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ప్రభుత్వాన్ని పడగొట్టిన రెండు వారాల రాజకీయ సంక్షోభం ముగిసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ రోజు అసెంబ్లీలో తల గణన ద్వారా తన ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే.. గత రాత్రి నియమితులైన శివసేన చీఫ్ విప్ భరత్ గోగావాలే జారీ చేసిన విప్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో అతను అనర్హత ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే ఎక్కువ ఓట్లు సాధించారు ఏక్ నాథ్ శిందే. శిండేకి మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ప్రతిపక్ష శిబిరానికి 99 మంది మద్దతు పలికారు. నిన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో విపక్షాలకు 107 మంది మద్దతు ఇచ్చారు. ఈ రోజు మరో ఎమ్మెల్యే షిండే క్యాంపుకు మారగా, పలువురు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు గైర్హజరు అయ్యారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాంగ్రెస్కు చెందిన విజయ్ వాడెట్టివార్, జీషన్ సిద్ధిఖీ ఈ రోజు అసెంబ్లీకి హాజరుకాలేదు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఓటింగ్ పూర్తి అయిన తరువాత అసెంబ్లీకి చేరుకున్నారు. ఎన్సీపీకి చెందిన సంగ్రామ్ జగ్తాప్ కూడా కనిపించలేదు. నిన్న నలుగురు హాజరయ్యారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన అబూ అజ్మీ, రైస్ షేక్, ఏఐఎంఐఎంకు చెందిన షా ఫరూక్ అన్వర్ ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఠాక్రే వర్గంకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ విశ్వాస పరీక్షకు నిమిషాల ముందు ఏకనాథ్ క్యాంపులో చేరారు. షిండే క్యాంపులో ఇప్పుడు మొత్తం 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఏక్ నాథ్ శిందే బలపరీక్షకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న స్పీకర్ గా ఎన్నికైన బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ .. ఠాక్రేకి షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కొత్త ముఖ్యమంత్రితో సహా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని శివసేన దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్న తరుణంలో స్పీకర్ నార్వేకర్ గత రాత్రి శిందేను శివసేన శాసనసభా పక్ష నేతగా తిరిగి నియమించడంతో పాటు శివసేన చీఫ్ విప్గా గోగావాలే నియామకాన్ని గుర్తించారు. గత నెల 20వ తేదీ ఏక్ నాథ్ శిందే తిరుగుబాటులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఠాక్రే బలం తగ్గిపోయింది. గవర్నర్ ఆదేశాల మేరకు సభా వేదికపై మెజారిటీ నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో గత బుధవారం ఠాక్రే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్నారు. ఒక రోజు తర్వాత బిజెపి నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన షాక్ ప్రకటనతో శిందే బీజేపీ మద్దతు తో ముఖ్యమంత్రి అయ్యారు. అదే రోజు సాయంత్రం అనూహ్యంగా బీజేపి పెద్దల ఒత్తిడితో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. శిందే మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అంగీకరించి ప్రమాణ స్వీకారం చేశారు.
మరో పక్క నూతన స్పీకర్ నర్వేకర్ శివసేన చీఫ్ ను మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఠాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శివసేన చీఫ్ విప్ ఉన్న ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభును తొలగించి భరత్ గోగావలే ను నియమించడాన్ని సవాల్ చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ పై జూలై 11న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.