Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ ప్రతిష్ట మహోత్సవాన్ని బీజేపీ తమ పార్టీ కార్యక్రమంగా మార్చేసిందని ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తుండగా, మరో పక్క దేశంలోని నాలుగు అధ్వైత మఠాలకు చెందిన అధిపతులు తాము ఈ కార్యక్రమానికి హజరు కావడం లేదని ప్రకటించి కొత్త వివాదానికి తెర తీశారు. మరో వారం రోజుల్లో అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ నలుగురు శంకరాచార్యులు గైర్హజరు అవుతుండటంతో పాటు ప్రతిష్ట కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతలు మీదుగా ఈ శుభ కార్యం జరగడాన్ని దేశ నలుమూలల ఉన్న నాలుగు మఠాలకు చెందిన శంకరాచార్యులు వ్యతిరేకిస్తున్నారు. శాస్త్రం ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ జరగడం లేదని, ప్రధాని గర్భగుడిలో ప్రవేశించడం సరికాదని మఠాధిపతులు ఆక్షేపిస్తున్నారు. గోవర్థన పీఠం, జ్యోతిర్మఠాలకు చెందిన నిశ్చలానంద స్వామి సరస్వతి, అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రతిష్ట జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైదిక సిద్ధాంతాల ప్రకారం రాముడు కొలువు తీరాలని వారు చెబుతున్నారు. అలా కానీ పక్షంలో విగ్రహ ప్రభావం క్షిణిస్తుందని, దుష్ట శక్తులు గర్భాలయంలో ప్రవేశిస్తాయని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ద్వారక, శృంగేరి లో ఉన్న శారదా పీఠాలకు చెందిన అధిపతులు సదానంద సరస్వతి, భారతీ తీర్ధ స్వామి మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. వారు కూడా ప్రతిష్ఠకు హజరయ్యే అవకాశాలు లేవన్న మాట వినబడుతోంది. దీనిపై పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలాంద స్పందిస్తూ .. ఆయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కు వెళ్లకూడదన్న నిర్ణయం తమ అహానికి సంబంధించి కాదని అన్నారు. ఇది సంప్రదాయానికి చెందినదిగా పేర్కొన్నారు. సనాతన సంప్రదాయానికి విరుద్దం కాబట్టే ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని స్వామిజీ స్పష్టం చేశారు.
శంకరాచర్యులందరికీ తమకంటూ ఆత్మగౌరవం ఉంది, ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు. రామ మందిరంలో ప్రధాని ప్రాణ ప్రతిష్ట చేస్తున్నప్పుడు తామంతా బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. సంప్రదాయాలను తారు మారు చేయడం లౌకిక ప్రభుత్వం చేసే పని కాదని అన్నారు. అలానే జనవరి 22 వ తేదీన రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. అది సరైన తేదీ కాదని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున నిర్వహించాలని అన్నారు.
ఈ క్రమంలో శంకరాచార్యుల అభిప్రాయాలను ఉటంకిస్తూ కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆలయ నిర్మాణం ఇంకా కొనసాగుతోందని, అసంపూర్ణమైన ఆలయంలో ప్రాణ ప్రతిష్ట చేయడం సనాతన ధర్మ సంప్రదాయానికి విరుద్దమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ఈ మొత్తం కార్యక్రమాన్ని రాజకీయం చేస్తొందని ఆరోపిస్తున్నాయి.
ఈ విషయంపై బీజేపీ తరుపున కేంద్ర మంత్రి నారాయణ ఠాణే మాత్రం ఇప్పటి వరకూ ఎవరూ చేయలేని పనిని ప్రదాని మోడీ చేశారన్నారు. దీనికి ఆయనను ఆశీర్వదిస్తారో.. శపిస్తారో శంకరాచార్యుల ఇష్టం అని వ్యాఖ్యానించారు. అయితే అయోధ్య విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి శంకరాచార్యుల బాయికాట్ అంశం పెద్ద చర్చకు తెరలేపింది.
Mathura: కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు .. మసీదు సర్వేపై స్టే