Mathura: ఉత్తర ప్రదేశ్ లోని మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు ఇవేళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆలయం చెంతనే షాహీ ఈద్గా మసీదులో కోర్టు పర్యవేక్షణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మసీదు సర్వే చేసేందుకు కమిషనర్ ను నియమిస్తూ అలహాబాదా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలని హింధూ సంఘాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాదీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయాలంటూ మథుర జిల్లా కోర్టులో గతం లో తొమ్మిది పిటిషన్లు దాఖలైయ్యాయి. ఈ పిటిషన్ లు చాలా కాలంగా పెండింగ్ లో ఉండటంతో .. వాటిని మథుర జిల్లా కోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ లో విచారణ జరిపిన హైకోర్టు.. న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గా లో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు దాని పర్యవేక్షణకు గాను అడ్వొకేట్ కమిషనర్ ను నియమించేందుకు అనుమతి ఇచ్చింది.
హైకోర్టు ఉత్తర్వులపై ముస్లిం కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా దర్మాసనం .. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. దీనిపై హింధూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
మథురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించారని హింధువుల తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీకృష్ణ విరాజ్ మాన్ కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటిషన్లు దాఖలయ్యాయి.