Sonu Sood: మరో సారి సోనూ సూద్ తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ అందించిన నిరుపమాన సేవలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. దేశ వ్యాప్తంగా సోనూ సూద్ ధాతృత్వాన్ని కొనియాడారు. రియల్ హీరో అంటూ ఆయనను కొనియాడారు. ఆ తరువాత కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అపర దాన కర్ణుడు అయిపోయారు. పలు గ్రామాల్లో ఆయనకు గుడి కట్టి పూజలు చేస్తుండగా, కొందరు అయితే వారి పిల్లలకు, వారి దుకాణాలకు సోనూ సూద్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినీ షూటింగ్ లలో బిజీబిజీగా ఉన్నప్పటికీ తన సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఎ రాష్ట్రంలో ఎవరికి కష్టమొచ్చినా, సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వేదికగా ఆయనకు తెలియజేస్తుంటే వెంటనే స్పందిస్తూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు సోనూ సూద్.
అదే క్రమంలో ఇటీవల ఓ కుగ్రామానికి సెల్ టవర్ ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజల హృదయాలనూ గెలుచుకున్నారు. మహారాష్ట్రలోని గోడియా జిల్లాకు చెందిన అన్మోల్ బిరన్వార్, మున్నా బీరన్వార్ అనే ఇద్దరు సోదరులు కరోనా నేపథ్యంలో గ్రామంలో ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకూ సుమారు 50 మంది విద్యార్థినీ విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. అయితే వారి గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు ఇబ్బందిగా మారింది. అన్మోల్ బిరన్వార్ ఈ సమస్యను సోనూ సూద్ కు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీనిపై వెంటనే స్పందించిన సోనూ సూద్ తన స్నేహితుడు కరణ్ గిల్వోత్రా సహకారంతో ఆ గ్రామంలో సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడంతో ఆ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం ఏర్పడింది. తమ గ్రామానికి సోనూ సూద్ ధాతృత్వంలో ఇంటర్నెట్ కష్టాలు తీరిపోయాయని సంబందిత ఫోోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వారు షేర్ చేయడంతో సోనూ సూద్ కు మరో సారి హాట్సాఫ్ తెలియజేస్తున్నారు.