Covid -19 Sub Variant JN.1: కొవిడ్ -19 కొత్త వేరియంట్ జేఎన్ 1 వేరియంట్ ప్రబలడంతో దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 614 కేసులు, మూడు మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. మే 21 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది. దేశ వ్యాప్త కోవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
తాజా వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మందులు, ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్ లు, వాక్సిన్ల కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించే నకిలీ సమాచార వ్యాప్తిని అడ్డుకోవాలని, రియల్ టైమ్ లో కేసుల సంఖ్య, పరీక్షల వివరాలు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు కోవిడ్ పోర్టల్ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ లు నిర్వహించాలని పేర్కొన్నారు.
జేఎన్ 1 వేరియంట్ సోకిన వారిలో 91 నుండి 92 శాతం మంది ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య) డాక్టర్ వికే పాల్ తెలిపారు. కొత్త జేఎన్ 1 ఉప రకాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ .. దీంతో ప్రజారోగ్యానికి ప్రమాదం తక్కువేనని పేర్కొంది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక తెలంగాణలో బుధవారం ఆరు కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ వెల్లడించారు. కరోనా సోకిన ఆరుగురూ హైదరాబాద్ కు చెందిన వారే. రాష్ట్రంలో ఒకరు వైరస్ నుండి కోలుకున్నారు. ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఏవీ నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో జనం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, సమూహాల్లో సంచరిస్తున్నప్పుడు మాత్రం మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.
Aravind Kejriwal: ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా