మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. పార్టీ ఎన్నికల గుర్తు ధనస్సు, బాణం గుర్తును షిండే వర్గానికే కేటాయించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్దవ్ ఠాక్రే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. రేపు విచారణ జరపనున్నట్లు తెలిపింది. శివసేనలో చీలిక అనంతరం అసమ్మతి నేతగా గుర్తింపు పొందిన ఏక్ నాథ్ శిండే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమదే అసలైన శివసేన అంటూ ఏక్ నాథ్ శిండే, ఉద్దవ్ ఠాక్రే వర్గాలు ప్రకటించుకున్నాయి.
అయితే ఈ సమస్య ను పరిష్కరించేంత వరకూ ఇరువర్గాలు వేర్వేరు గుర్తులు ఉపయోగించుకోవాలని సూచించిన ఈసీ.. తాజాగా ఏక్ నాథ్ శిండే నేతృత్వంలోని పార్టీనే అసలైన శివసేన అని ఈసీ గుర్తిస్తూ ఇటీవల నిర్ణయాన్ని వెలువరించింది. దీనిపై శిండే వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే భావజాలం సాధించిన విజయమని శిండే అభివర్ణించారు. ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసిన శిండే ..తమదే నికార్సయిన శివసేన అని తేలిందన్నారు. బాలా సాహెబ్ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకుని తాము బీజేపీతో కలిసి గత ఏడాది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
అయితే శివసేన పార్టీ అధికారిక గుర్తింపునకు ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నది అనే విషయంపై ఈసీ వివరణ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలు 76 శాతం ఓటింగ్ సాధించారనీ, వారందరి మద్దతు ఏక్ నాథ్ శిండే కు ఉందని వివరించింది. అటు ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం మాత్రమే ఓటింగ్ లభించిందని పేర్కొంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్దవ్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఎటువంటి తీర్పు వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది.