BJP: బిజెపి BJP రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కు అకస్మాత్తుగా బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రేమ అంటే అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం బీసీలకు ఇస్తామని చెప్పేఅంత ప్రేమ. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను బీజేపీ వైపు తిప్పుకునే ప్రేమ. ఈ ప్రేమ సంగతి బాగానే ఉన్నా మరి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి, పవన్ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూర్చోబెడతారు అన్నది ప్రధాన ప్రశ్న. ఇది ప్రశ్న కాదు ఒక రాజకీయ వ్యూహంలాగానే కనిపిస్తోంది. సోము వీర్రాజు మాటలు ఈరోజు ఎక్కడితో ముగిసిపోయే పరిస్థితి ఉండదు. రానురాను బిజెపి బీసీల మంత్రాన్ని ఎత్తు కోవాలని చూస్తే మాత్రం ఓ పటిష్టమైన రాజకీయ ఎత్తుగడ ను సిద్ధం చేసే సోము వీర్రాజు నోటి నుంచి ఈ మాట అనిపించిందా అనే అనుమానం కలుగుతుంది. అయితే కేవలం సోము వీర్రాజు ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తే పర్వాలేదు గానీ ఇటు వైపు కాపులను దువ్వుతు, మరోపక్క బీసీలకు సైతం ముఖ్యమంత్రి పదవి ఆశ చూపి, రెండు పడవల మీద కాలు వస్తే మాత్రం మునిగిపోవడం ఖాయం. లేదా దానికి కచ్చితంగా ఓ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయానేది అంచనా.
ఎప్పుడు ఎందుకు బీసీ రాగం!
కుల రాజకీయాల్లో ఆరితేరిన పోయిన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అదే తీరున ఆంధ్రప్రదేశ్లో సైతం కుల రాజకీయాలు చేయాలని ఆరాటపడుతోంది. దీనిలో భాగంగా రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న కాపులను బిజెపికి అనుకూలంగా మలుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రారంభించింది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడతో ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం భేటీ అయి పలు విషయాల గురించి చర్చించారు. ఈ భేటీ వెనుక బిజెపి కేంద్ర పెద్దల వ్యూహం ఉన్నట్లు సోము వీర్రాజు మీడియా ముందు చెప్పారు. దీంతో పాటు తమ మిత్రపక్షమైన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో బేటీ అవ్వడం, వివిధ అంశాల మీద కాపు సంఘాల నాయకులతో పవన్ ఇంటరాక్షన్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ పక్క కాపులను బీజేపీ జనసేన కు మద్దతుగా మలుచుకునే మరోపక్క బీసీలకు సైతం ప్రాధాన్యం ఇస్తామని బిజెపి చెప్పే వ్యూహం ఇప్పుడు కనిపిస్తోంది. తమ ప్రభుత్వం వస్తే బీసీలను చక్కగా గౌరవిస్తామని వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంలో భాగంగానే సోము వీర్రాజు బీసీలకు ముఖ్యమంత్రి పదవిని సైతం ఇస్తామని చెప్పారా లేక దీనికి ప్రత్యేకంగా బిజెపి ప్రత్యేక వ్యూహం రచించింద అనేది తెలియాలి.
పవన్ పరిస్థితి ఏంటీ??
భారతీయ జనతా పార్టీ జనసేన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జట్టుకట్టే ముందుకు సాగుతున్నాయి. తమ రెండు పార్టీల్లో జనసేనకు 2019 ఎన్నికల్లో ఆరు శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అంటే బిజెపి కంటే జనసేనకు ప్రజల్లో బలమైన ఓట్ బ్యాంకు ఉంది. దీంతో పాటు బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న పడే తమ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోము వీర్రాజు స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే సోము వీర్రాజు నోటి నుంచి బీసీలను ముఖ్యమంత్రి చేస్తాను అంటూ కొత్త రాగం ఎత్తుకోవడం చూస్తే యూట్యూబ్ జనసేన కార్యకర్తలు సైతం అయోమయంలో పడే పరిస్థితి నెలకొంది. దీంతో పాటు రకరకాల అంశాల మీద బీజేపీ తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు తాజాగా సోము వీర్రాజు ఏకపక్షంగా మాట్లాడిన మాటలతో మరింత కోపంతో ఉన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తు లో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కచ్చితంగా పవన్ కళ్యాణ్ వుంటారని ఇప్పటివరకు జనసేన కార్యకర్తలు ఆశిస్తే, ఇప్పుడు సోము వీర్రాజు ఎవరితో మాట్లాడకుండా ఏకపక్షంగా బీసీ ముఖ్యమంత్రి జపం అందుకోవడంతో జనసేన కార్యకర్తలు లో ఒక రకమైన కోపం బయటపడుతుంది. అయితే ఇది సోము వీర్రాజు సొంత నిర్ణయం లేక కేంద్ర పార్టీ పెద్దల మాట ప్రకారమే సోము వీర్రాజు ఈమాట మాట్లాడారా అన్నది త్వరలో తేలిపోనుంది. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో జనసేన బీజేపీ పొత్తు గనుక ఉంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి బిజెపి సిద్ధంగా లేదా?? ఇప్పుడు ప్రత్యేకంగా సోము వీర్రాజు మాటల్లో కొత్త నినాదం ఎందుకు వచ్చింది అన్నది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ముదిరిన సమయంలో స్పష్టంగా బయటపడుతుంది.