తానంటే గిట్టని ఒక వ్యక్తి చేసిన ఆధారాలు లేని, తప్పుడు ఆరోపణల కారణంగా తనను పదవి నుంచి తొలగించారని సిబిఐ మాజీ డైరక్టర్ అలోక్ వర్మ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి సిబిఐ డైరక్టర్ పదవిలో నియమించిన రెండవ రోజునే ఆయనను మళ్లీ తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. సిబిఐ డైరక్టర్ను ఎంపిక చేసే ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే సభ్యులుగా ఉన్నారు. గురువారం జరిగిన కమిటీ సమావేశానికి ప్రధాన న్యాయమూర్తి బదులు జస్టిస్ ఎకె సిక్రీ హాజరయ్యారు.
అలోక్పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ తన నివేదికలో పేర్కొన్నందున ఆయనను సిబిఐ డైరక్టర్ పదవి నుంచి తొలగించాల్సిందేనని కమిటీ నిర్ణయించింది. ఖర్గే మాత్రం దీనితో విబేధించారు. అలోక్పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవంటూ ఆయన కమిటీకి డిస్సెంట్ నోట్ ఇచ్చారు.
ఉన్నతస్థానాలలో ఉన్న వారిపై వచ్చే అవినీతి ఆరోపణల మీద దర్యాప్తు జరిపే సంస్థ కాబట్టి సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని అలోక్ వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను సంస్థ ప్రతిష్టను కాపాడేందుకు కృషి చేశాననీ, మరోపక్క దానిని నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనీ ఆయన పేర్కొన్నారు. సివిసి, కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు చూస్తేనే ఆ సంగతి తెలిసిపోతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.