(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)
అమరావతి భూకుంభకోణం దర్యాప్తులో ప్రభుత్వం దూకుడు పెంచింది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల క్రయ విక్రయాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన ప్రభుత్వం దీనిలో అక్రమాలు వెలికి తీసేందుకు ఏసీబీ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార దుర్వినియోగం చేసి బంధువులకు భూములు కొనుగోలు చేశారనే అభియోగంపై మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు మరో 12 మందిపై ఏసిబి కేసు నమోదు చేసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది.
అమరావతి భూ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా, నిర్బంధించకుండా, తనపై ఇతర కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు దర్యాప్తునకు అవసరమైన ప్రాధమిక సమ్మతిని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టి వేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు దమ్మాలపాటి. తనపై కేసు నమోదు చేశారా లేదా అన్న విషయం కూడా తెలియదనీ, ప్రభుత్వం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరగనున్న నేపథ్యంలో దమ్మాలపాటి శ్రీనివాస్తో సహా మరో 12 మందిపై ఏసిబి కేసు నమోదు చేసినట్లు ఏసిబి అధికారి నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు.