అమరావతి… నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అనే గుర్తింపు నుంచి మూడు రాజధానుల్లో ఒకటిగా మిగలబోతున్న (!) ప్రాంతం. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు, సామాన్యుల ప్రజల ఆలోచనలు కూడా అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి.
కొత్త కొత్త డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. పాత ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్థానికులు చేస్తున్న ఆందోళన 250 రోజులకు చేరింది. అయితే, ఈ సమయంలో అమరావతిప కొత్త విశ్లేషణ మొదలైంది.
పాపం చంద్రబాబు…ఓ నెరవేరని కల
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి దాని రూపశిల్పిగా మిగిలిపోదామనుకొని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రయత్నాలు తాను చేశారు. ఎన్నో దేశాలు తిరిగారు. డిజైన్లు పరిశీలించారు. రకరకాల ప్రకటనలు చేశారు. ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే, ఆచరణలో మాత్రం అందరు ప్రజల ఆదరణను అమరావతి పొందేలా చేయలేకపోయారన్నది అనేక మంది చెప్పే మాట.
ఏపీకి ప్రత్యేక హోదా… అమరావతి రాజధాని
2019లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడురాజధానుల ఏర్పాటు ప్రకటన చేసింది. దీంతో ఏపీ ప్రజల్లో కలకలం మొదలైంది. రాజకీయంగా ఆయా పార్టీలు తమ వైఖరులు వెల్లడించాయి. స్థూలంగా చెప్పాలంటే, అమరావతి రాజధానిగా ఉండాలనే విషయంలో పార్టీలన్నీ వేటి స్ట్రాటజీని అవి ఫాలో అవుతున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ మాదిరిగా. అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం కూడా ఇలాంటి రాజీనామాల డిమాండ్లే వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వ నుంచి తన మంత్రులను రాజీనామా చేయించింది. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేశారు. ఇదంతా ఎన్నికల ముందు పొలిటికల్గా పైచేయి సాధించడానికే అనేది అందరికీ తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగింపు విషయంలోనూ రాజీనామా డిమాండ్లు తెరమీదకు వచ్చాయి.
జనసేన, బీజేపీ భలే కలిసి వచ్చాయే
రాజధానుల విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయోధ్యనూ అమరావతిలా పోల్చి మాట్లాడుతూ బీజేపీ ఎజెండా తాను హైజాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రయోజనం లేకపోయింది. మరోవైపు, మూడు రాజధానుల విషయంలో వైసీపీ కూడా సూటిగా బీజేపీని విమర్శించిన దాఖలాలు ఇంతవరకూ లేవు. జనసేన కూడా తటస్థంగానే స్పందించింది. ఈ విధంగా మూడు ప్రాంతీయ పార్టీలు అనుకూలంగా వుండటం అధికార వైసీపీ పని తేలిక చేసిందన్నది కాదనలేని నిజం.
బీజేపీ మెలిక…
రాజధాని మార్పునకు తాము వ్యతిరేకం కాదన్న బీజేపీ ఇందులో కేంద్రం జోక్యం ఉండదు అని ప్రకటించింది. ఈ మేరకు కోర్టులో కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక రాజధాని వున్నప్పుడు ఏ విధంగా అవినీతిపై పోరాడామో ఇప్పుడు మూడు రాజధానులోనూ అవినీతి జరిగితే పోరాడతామని బీజేపీ నేత రాం మాధవ్ అన్నారు. దీన్ని బీజేపీ రెండు నాల్కల దోరణిగా చూడాలా అని కొందరు డౌట్ చెందుతున్నారు. మొత్తంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించే విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజీనామాల డిమాండ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రజలకు పార్టీల వైఖరి ఏంటో…తమ రాష్ట్ర రాజధాని భవిష్యత్ ఏంటో తెలియని గందరగోళంలో పడేస్తున్నాయి.