గతంలో హెరిటేజ్ కంపెనీ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిందని దానిలో అవకతవకలు జరిగాయని సిబిఐ విచారణ కు ఏపీ క్యాబినెట్ నిర్ణయించుకుంది. అది చంద్రబాబు కుటుంబానికి చెందిన కంపెనీ కావడంతో ప్రభుత్వం, సిబిఐ విచారణలో అంత సీరియస్ గా తీసుకున్నాయి. మరి ఇదే జగన్ కు కూడా వర్తిస్తుందా..?
మరీ ఇంత బహిరంగంగానా…?
నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలను ముఖ్యమంత్రి సొంత మీడియాకు ఇచ్చారు అన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. జగన్ కంపెనీల విషయంలో ప్రభుత్వ పెద్దలు గతంలో హెరిటేజ్ పైన చూపిన నిబద్ధత…. నిజాయితీ చూపించడం లేదు. ఈ ఏడాది కాలంలో దాదాపుగా రూపాయలు 60 నుండి 70 కోట్ల రూపాయలు సాక్షికి ప్రకటనల రూపంలో వచ్చాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కంటే ఇది దాదాపు 20 శాతం ఎక్కువ. అన్ని ప్రకటనలు సాక్షి కి వెళ్లడం అవినీతి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.
ఒక్కడే గుట్టంటా విప్పాడు..!
‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ చట్టం కింద ఓ వ్యక్తి ప్రభుత్వం నుండి సేకరించిన వివరాల ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఖచ్చితంగా ఏడాది కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా మొత్తం 17 కోట్ల ప్రకటనలు జారీ అయ్యాయి. ఇందులో రెండవ అత్యధిక సర్కులేషన్ ఉన్న సాక్షి పత్రికకు ఆరు కోట్ల పైన వాటా ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు ఇచ్చింది నాలుగు కోట్ల 20 లక్షల ప్రకటనలు మాత్రమే. మూడో స్థానంలో ఆంధ్రజ్యోతి పత్రిక పేరు అసలు దాదాపుగా తుడిచేశారు. ఏడాది కాలంలో వారికి 20 లక్షల ప్రకటనలు మాత్రమే ఇచ్చినట్లు చూపించారు. ఇదే సమయంలో ప్రజాశక్తి కి కోటికి పైగా ప్రకటనలు వెళ్లాయి. ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్ లకు కూడా 60 70 లక్షల వరకు ఇవ్వడం గమనార్హం.
ప్రభుత్వం మారితే అవినీతేనా..?
ఇక ఇదంతా బయటకు కనిపించేది మాత్రమే. ఇతర డిపార్ట్మెంట్లు విడివిడిగా తమ ఖాతాల ద్వారా ప్రకటనలు జారీ చేశారు. ఇలా అవి మొత్తం ఖర్చు పెట్టిన డబ్బు సుమారు 82 కోట్ల వరకు ఉంటుంది. ఈ మొత్తంలో సాక్షి పత్రిక కు సహజంగానే మెజారిటీ వాటా వెళ్ళింది. దాదాపుగా 35 కోట్ల రూపాయలు సాక్షి ఖాతాలోకి వెళ్లగా సర్కులేషన్ లో మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకి 27 కోట్లు వెళ్లాయి. ఆంధ్రజ్యోతి కి మరలా మెండి చేయి ఎదురైంది. డిపార్ట్మెంట్ ఎలా ప్రకటనలు ఇచ్చినా అది ప్రజాధనం.
పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ కుటుంబాలకు చెందిన వ్యాపార సంస్థలకు పిసరంతైనా మేలు చేయడానికి జంకుతారు కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి సొంత పత్రికకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు వెళ్లాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కన్నా ఎక్కువగా ప్రకటనలు ఇవ్వడం ఏమిటో వారికే తెలియాలి. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటనల రేట్లను భారీగా పెంచేసింది. ఇక్కడ సాక్షికి అత్యధిక ప్రకటనలు వెళ్లడం తోనే అవినీతి అంతా తేటతెల్లమైంది.