Anganwadi Workers Arrest: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ కార్యకర్తలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అంగన్ వాడీలు విజయవాడ రాకుండా అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుండే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 40 మంది అంగన్ వాడీ కార్యకర్తలను అరెస్టు చేయగా, వారు స్టేషన్ లోనే నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా నుండి రెండు బస్సుల్లో బయలుదేరిన అంగన్ వాడీలను కావలి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను కావలి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో విజయవాడ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్దకు ఆదివారం రాత్రే అంగన్ వాడీలు భారీ గా చేరుకుని నిద్రించింది. దర్నా చౌక్ లోని అంగన్ వాడీల నిరసన శిబిరాన్ని సోమవారం తెల్లవారుజామున పోలీసులు తొలగించి, టెంట్లు కూల్చివేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన అంగన్ వాడీ కార్యకర్తలు, సీఐటీయు కార్యకర్తలను అరెస్టు చేశారు.
డీసీపీ విశాల్ గున్ని నాయకత్వంలోని పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అంగన్ వాడీ నాయకులను, కార్యకర్తలను వాహనాల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. అయితే, సోమవారం విజయవాడలో ఎటువంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు.