అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో అధికార యంత్రాంగం చాలా బాగా పని చేసిందంటూ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కితాబు ఇచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఏస్పీలు, క్షేత్ర స్థాయిలో గ్రామ వాలంటీర్, సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎస్లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారని జగన్ ప్రశంసించారు.
మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ అధికారుల పనితీరును ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు.
కలెక్టర్లు, ఎస్పీలు బాగా పని చేస్తే.. ప్రభుత్వం బాగా పరిపాలన చేసినట్లు అవుతుందని జగన్ అన్నారు. నాల్గవ విడత లాక్ డౌన్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మూడు విడతల లాక్ డౌన్ లో అనుసరించిన పద్దతి వేరు. నేడు నాలుగవ విడత లాక్ డౌన్ లో అనుసరిస్తున్న పద్దతులు వేరని తెలియచేస్తూ ఈ విడతలో ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు. కోవిడ్ –19 నివారణ చర్యలు కొనసాగిస్తూనే మరో వైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు.
షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మత పరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట అంతా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉందని చెప్పారు. చిన్న చిన్న దుకాణాల దగ్గరి నుంచి ప్రతీదీ ఓపెన్ చేయానీ, రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభం అవుతుందని జగన్ తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయని చెబుతూ ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలనీ తెలియచేసారు.
కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలను పూర్తిగా తొలగించాలని సూచించిన జగన్ రాబోయే కాలంలో కోవిడ్ రాని వారు ఎవ్వరూ ఉండరేమో?. అది వస్తుంది.. పోతుంది అని పేర్కొన్నారు. ఈ వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించేందుకు తీసుకోవసిన చర్యలను సీఎం జగన్ వివరించారు.