తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మూడు రోజుల హస్తిన పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కెసిఆర్ పీఎం మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులను కలిసి వచ్చారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటన పెడుతున్నారు. రేపు (15వ తేదీ) ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
సీఎం జగన్ మంగళవారం (రేపు) సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరి ఢిల్లీకి వెళ్తున్నారు. జగన్ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ తో భేటీ కానున్నారు. ఈ రోజు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలు పరిష్కారం అవుతాయన్నారు. రెండు రోజుల క్రితమే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. ఈ తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.