(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వివిధ వర్గాల పేద ప్రజల సంక్షేమే లక్ష్యంగా నవరత్న పథకాలను అమలు చేస్తున్న జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తాజాగా సమాజంలో వివక్షతకు గురవుతూ ఒంటరిగా జీవనం సాగించే ట్రాన్స్జెండర్ల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నది. వీరికి రైస్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని భావిస్తోంది.
ఇప్పటికే అధికారులు దీనిపై కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్ జెండర్లను గుర్తించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. రేషన్ కార్డు లేని అనాధలు, ట్రాన్స్ జెండర్లు, పిల్లలు లేని వితంతువులు, ఇల్లు లేని వారిని వాలంటీర్లు గుర్తించాలని అధికారులు ఆదేశించారు.
ప్రభుత్వం మంజూరు చేసే రైస్ కార్డులతో వీరు ప్రతి నెలా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల (రేషన్ షాపులు) ద్వారా నిత్యావసర వస్తువులు పొందే అవకాశం ఏర్పడుతుంది. రైస్ కార్డుల కొరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో వీరు ధరఖాస్తు చేసుకునేలా వాలంటీర్లు అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు. వీరికి పది రోజుల్లోనే కొత్త రైస్ కార్డులను మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.