ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ తనదైన మార్క్ పరిపాలన చేస్తున్నారు. అయితే.. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయంపై మండలిలో బ్రేక్ పడటానికి పరోక్షంగా చంద్రబాబు కారణమని అనేక వార్తలు వచ్చాయి. పైగా.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇలా పదే పదే అడ్డంకులు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించడం తప్పలేదు. ఈరకంగా ప్రతిపక్షం సంబరపడిపోయింది. అయితే.. వారి ఆనందం గంటల్లోనే ఆవిరైపోయింది.
నిన్న మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ మూడు రాజధానుల అంశంపై సంతకం పెట్టడం టీడీపీకి భారీ షాక్ ఇచ్చింది. దీంతో ఒక అంశంలో వైసీపీ ఓడినా.. మరో అంశంలో పైచేయి సాధించింది. కేవలం గంటల్లోనే వైసీపీ – టీడీపీకి ఒక పాజిటివ్, ఒక నెగటివ్ నిర్ణయాలు వచ్చాయి. అయితే.. ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు వైసీపీదే పైచేయిగా నిలిచిందని చెప్పాలి. నిమ్మగడ్డ వ్యవహారం కేవలం గంటలోనే మరుగున పడిపోయింది. టీడీపీ ఆనందించినంత సేపు లేదు.. వైసీపీ గర్వంగా తలెత్తుకోవటానికి. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది. ఏ మీడియాలో చూసినా రాజధానుల అంశమే. ఇది వైసీపీ ప్లానా.. జగన్ వ్యూహమా.. ప్రభుత్వ విజయం అనుకోవాలో అర్ధం కాని పరిస్థితుల్లో రాజకీయ వర్గాలు తల పట్టుకున్నాయి.
దీంతో ప్రతిపక్షానికి నిమ్మగడ్డను ఎరగా వేసి రాజధాని వంటి చేపను మాత్రం ప్రభుత్వం పట్టేసింది. ఇది వైసీపీ, జగన్, ప్రభుత్వానికి భారీ విజయం. గంటల వ్యవధిలో రాజధాని అంశం తెరపైకి రావడంతో నిమ్మగడ్డ విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. లేదంటే.. ఈ రోజుకి కూడా టీడీపీ అనుకూల మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు, టీడీపీ నాయకుల హడావిడి భారీగా జరిగేది. కానీ.. జగన్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. వారికి విజయం రుచి చూపించినట్టే చేసి.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని టీడీపీకి కునుకులేకుండా చేశారు.