రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై దాదాపు ప్రతి అంశం కోర్టు మెట్లెక్కుతోంది. కొన్నింటిపై ప్రతిపక్షాలు, మరికొన్నింటిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల విషయంలో పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ముందుకు రాగా అక్కడి నుంచి ప్రధాన న్యాయమూర్తి బెంచ్కు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రకటనలు సాక్షి మీడియాకే ఇస్తున్నారని.. ప్రకటనల్లో వైసీపీ పార్టీ గుర్తుల రంగులు పోలి ఉంటున్నాయనే ప్రధాన ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ప్రకటనల విషయంలో ప్రభుత్వం బంధు ప్రీతి: పిటిషనర్
ప్రకటనల విషయంలో ప్రభుత్వం బంధు ప్రీతి ప్రదర్శిస్తోందనీ.. సీఎం జగన్ సతీమణి భారతీరెడ్డి డైరెక్టర్గా ఉన్న జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ప్రకటనలు ఇస్తున్నారని విజయవాడకు చెందిన నాగ శ్రవణ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తోందని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసును సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. ఈ ప్రకటనల్లో రాజకీయ పార్టీ రంగులు, సీఎం తండ్రి ఫొటో ఉన్న ప్రకటననూ పరిశీలించాలని కోరారు. దీనిపై ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ముఖ్యమంత్రి తండ్రి కూడా గతంలో ముఖ్యమంత్రే కదా అని వ్యాఖ్యానించింది. దీనికి న్యాయవాది బదులిస్తూ.. కేవలం సీఎం ఫొటో మాత్రమే వాడాలని సుప్రీం సూచించిందన్నారు.
ఈ పిటిషన్ లో రాజకీయ దురుద్దేశం ఉంది: ఏజీ
ఈ పిల్ దాఖలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. పసుపు రంగుతో గత సీఎం ఫొటోను ప్రచురించిన ప్రకటనను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రకటనల్లో మంత్రులు, క్యాబినెట్ మంత్రుల ఫొటోల ప్రచురణకు సుప్రీం అనుమతిచ్చిందని ఏజీ తెలిపారు. దీనికి జస్టిస్ రాకేశ్కుమార్ బదులిస్తూ.. గత ప్రకటనలనూ హైకోర్టు సమర్థించ లేదని అన్నారు. మంత్రుల ఫొటోలు ప్రచురించడానికి తాను వ్యక్తిగతంగా వ్యతిరేకినని.. ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు తెలియజేసేలా ప్రకటనలు ఉంటే చాలన్నారు. మంత్రులు సినిమా హీరోలు కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.