అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వరదలపై చంద్రబాబు శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పిన విషయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన చెప్పినట్లు వరద నీటిని వదిలి ఉంటే నేడు డ్యామ్ల్లో నీరు ఉండేది కాదని అనిల్ కుమార్ అన్నారు.
అధికార యంత్రాంగం సమర్థవంతంగా పని చేయడం వల్లనే ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అనిల్ కుమార్ పేర్కొన్నారు. నది ఒడ్డున ఇల్లు కట్టుకుంటే ఇల్లు మునగక ఏమవుతుందని అనిల్ కుమార్ ప్రశ్నించారు. నీటి విడుదలపై చంద్రబాబు, టిడిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారనీ, ఈ నెల మూడవ తేదీ నుండి ప్రాజెక్టుల నీటి లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిన తర్వాతే పోతిరెడ్డిపాడు నుండి నీళ్లు రాయలసీమకు తరలించగలమని అనిల్ అన్నారు. వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వదిలేస్తే రాయలసీమకు నీరు ఎలా ఇవ్వగలమని అనిల్ కుమార్ ప్రశ్నించారు. ఈ నెల తొమ్మిదిన శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశామని అనిల్ కుమార్ చెప్పారు. పులిచింతల నీరు రాకముందే ప్రకాశం బ్యారేజి నుండి నీటిని విడుదల చేశామని అనిల్ కుమార్ తెలిపారు. సామర్థ్యం మేరకే ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేస్తారని అనిల్ కుమార్ పేర్కొన్నారు.