పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై రాష్ట్ర మంత్రులు శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటే అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పలువురు వైసీపీ ఎంపిలు కలిశారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధులపై చర్చించి సవరించిన అంచనాలను ఆమోదించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. 2017-18 సవరించిన అంచనాలను ఆమోదించాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ వద్ద అంచనాలు పెంపు వ్యవహారం పెండింగ్లో ఉందని వారు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను పలు మార్లు కలిసి అంచనాల పెంపుపై చర్చించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అనంతరం మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్లు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. ప్రాజెక్టు పనులు పరిశీలనకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ 15 రోజుల్లో వస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్ర జల సంఘం ఇప్పటికే ప్రాజెక్టు మారిన అంచనాలకు ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ నుండి కూడా అనుమతులు లభించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గత నెలలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ నిధులు తదితర అంశాలపై ప్రధాన మంత్రి మోడికి లేఖ రాసిన అనంతరం రూ.2,234.28 కోట్లు కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే.