Ayodhya Ram Mandir Pratishtha: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అధ్యాత్మికవేత్తలు, రాజకీయ నేతలు, ప్రముఖులు, ప్రఖ్యాత కళాకారులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అయోధ్యకు చేరుకున్నారు.
జగద్గురు శంకరాచార్య కంచి కామకోటి పీఠం స్వామి విజయేంద్ర సరస్వతి, రాధాస్వామి సత్సంగ్ బియాస్ కు చెందిన గురీందర్ సింగ్ ధిల్లాస్, నటులు రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, గజేంద్ర చౌహాన్, రణ్ దీప్ హూడా, మ్యూజిక్ డైరెక్టర్ అనుమాలిక్, క్రికెటర్ అనిల్ కుంబ్లే, నటి షెఫాలీ షా, కంగనా రనౌత్, భారత్ ఫోర్జ్ గ్రూపు బాబా కల్యాణి, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజకీయ నేతలు చంద్రబాబు, మీనాక్షి లేఖి తదితురులు అయోధ్యకు చేరుకున్నారు.
ఒక్కరోజే 40కిపైగా చార్టర్ విమానాలు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాయని అయోధ్య మహర్షి వాల్మీకి ఎయిర్ పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార తెలిపారు. గోరఖ్ పూర్, వారణాసి, ఖుషీనగర్, ప్రయాగ్ రాజ్, లక్నో ఎయిర్ పోర్టుల వైపు విమానాలు మళ్లించామన్నారు. 10.25 గంటలకు అయోధ్య ఎయిర్ పోర్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్న ఫ్లైట్ ల్యాండ్ అవ్వనుంది. అందుకోసం పటిష్టంగా సీఐఎస్ఎఫ్ భద్రతా ఏర్పాట్లు చేసింది.
అయోధ్య వీధులు అన్ని విద్యుత్ దీపాలు, కషాయ జెండాలు, తోరణాలతో అతిధులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న జనాలతో అయోధ్య సందడిగా మారింది. ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని వేల మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా తిలకించనున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బలరాముడి దర్శనం ఉంటుంది. ఇప్పటికే 30వేల మంది పోలీసులను అయోధ్యలో భద్రతకు వినియోగిస్తున్నట్లు పోలీసు అధికారుల ప్రకటించారు. పదివేల సీసీ కెమెరాలు అమర్చి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్య రామమందిరానికి వెళ్ల ప్రధాన రహదారుల్లో పాస్ ఉన్న వాహనాలకే అనుమతి ఇస్తున్నారు.