కరోనా వేళ ప్రజలు అందరూ మాస్క్ లు ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలనీ, జాగ్రత్తలు పాటించాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ముఖ్య మంత్రులు సూచిస్తున్నా కొందరు నాయకులే వాటిని పెడచెవిన పెడుతున్నారు. ప్రజలు గానీ, నేతలు గానీ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తే వివిధ రాష్ట్రాల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
అయినప్పటికీ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ ప్రజా ప్రతినిధి నిర్వాకం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆయన చేసిన అతి వల్ల పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
వివరాల్లోకి వెలితే…బెంగళూరు మహానగరంలోని పాదరాయనపుర డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ పాషాకు కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిన వ్యక్తి బుద్దిగా వెళ్లి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉండగా, ఆయనేదో విదేశీ పర్యటనకు వెళుతున్నట్లుగా వందలాది మంది అభిమానులు ఆయన ఆసుపత్రికి వెళుతుంటే వీడ్కోలు పలకడం సంచలనంగా మారింది. ఇది చాలదన్నట్లు తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఆయన తిరిగి ఇంటికి వస్తుండగా అయినకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సమయంలో వారికి నచ్చచెప్పి పంపించాల్సి ఉండగా, ఆయన వారి అభిమానానికి ఉప్పొంగి తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో కలిసి మూడు కిలోమీటర్ల మేర ఊరేగింపు చేపట్టారు. కరోనా లాక్ డౌన్ వేళ ఒక మహానగరంలో నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ జరువుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా?, వారి పని వారు చేశారు. ఊరేగింపును అడ్డుకొని కార్పొరేటర్ ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హోమ్ క్వారంటైన్ కు తరలించారు.
భౌతిక దూరం పాటించకుండా ఆయన నిర్వహించిన ఊరేగింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేటర్ ఇమ్రాన్ పాషాపై చర్యలు తీసుకోవన్న డిమాండ్లు వస్తున్నాయి.