కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఎన్నో కోట్ల మంది ఉద్యోగాలను, కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇప్పటికీ పలు కంపెనీల్లో ఇంకా పనిలేదని చెప్పి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నారు. అయితే కరోనా ప్రభావం బీసీసీఐపై కూడా పడింది. మార్చి నుంచి జరగాల్సిన ఐపీఎల్ సెప్టెంబర్లో జరగనుంది. దాని వల్ల కొంత వరకు నష్టాన్ని పూడ్చుకున్నా.. కరోనా వల్ల చాలా పెద్ద మొత్తంలోనే బీసీసీఐకి నష్టం వాటిల్లింది. అయితే ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు గాను బీసీసీఐ త్వరలో ప్లేయర్లు, ఇతర సిబ్బంది జీతాల్లో కోత విధించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అవసరం లేని సిబ్బందిని తొలగించాలని కూడా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
అయితే కరోనా నేపథ్యంలో గతంలో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ప్లేయర్లు, సిబ్బంది జీతాల్లో ఎలాంటి కోతలు విధించబోమని, వారికి యథావిధిగా చెల్లింపులు చేస్తామని తెలిపారు. కానీ ఇప్పటికే వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఆ పనిచేయక తప్పడం లేదని తెలుస్తోంది. అందుకనే బీసీసీఐ త్వరలో ప్లేయర్లు, సిబ్బంది వేతనాలను కట్ చేయడంతోపాటు, అవసరం లేని వారిని తీసేయాలని కూడా ఆలోచిస్తోంది.
ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఐపీఎల్ జరుగుతుంది కనుక ఆ తరువాతే బీసీసీఐ పై విధంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఐపీఎల్ 13వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్గా వివో తప్పుకోవడంతో బీసీసీఐకి రూ.220 కోట్ల వరకు నష్టం వచ్చింది. అలా జరగకపోయి ఉంటే బీసీసీఐకి రూ.440 కోట్లు వచ్చేవి. కానీ డ్రీమ్ 11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కావడంతో అందులో సగం వరకు అంటే.. రూ.222 కోట్ల వరకు నష్టాన్ని పూడ్చుకునే అవకాశం కలిగింది. అయినప్పటికీ మొత్తంగా చూస్తే బీసీసీఐకి నష్టాలే వచ్చాయి. ఇక ఐపీఎల్ నేపథ్యంలో బీసీసీఐ కాస్ట్ కటింగ్ కూడా చేసింది. అవసరమైన మేరకే ఖర్చులు చేస్తూ టోర్నీని నిర్వహించనుంది. మరి బీసీసీఐ ప్లేయర్లు, సిబ్బంది వేతనాల్లో కోత విధిస్తుందో, లేదో చూడాలి.