రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో యువతి (డెంటిస్ట్) కిడ్నాప్ తీవ్ర కలకలాన్ని రేపింది. టీ రెస్టారెంట్ యజమాని నవీన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కుర్రవాళ్లను వెంట వేసుకుని వచ్చి ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి తమ కుమార్తె ను కిడ్నాప్ చేశాడని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ టీవీ పుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనతో యువతి బంధువులు నవీన్ రెడ్డికి చెందిన టీ రెస్టారెంట్ ను ధ్వంసం చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలోనే యువతి తాను క్షేమంగా ఉన్నట్లుగా తండ్రికి ఫోన్ చేసింది. ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. యువతిని షీ టీమ్ సంరక్షణలో ఉంచారు. నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది కానీ పోలీసులు దృవీకరించలేదు.
అయితే నవీన్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టాడు. తాను, వైశాలి గత ఏడాది జనవరి నుండే ప్రేమలో ఉన్నామనీ, 2021 ఆగస్టు 4న బాపట్ల జిల్లా వలపర్లలోని గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం కూడా చేసుకున్నామని చెప్పారు. బీడీఎస్ పూర్తి అయ్యే వరకూ పెళ్లి ఫోటోలు బయటకు రానివ్వవద్దని వైశాలి కండీషన్ పెట్టిందని తెలిపారు. వైశాలి కండీషన్ ప్రకారం తాను ఫోటోలను లీక్ చేయలేదన్నారు. 2021 లో జనవరి నుండి ప్రేమలో ఉన్నట్లు కోర్టుకు నవీన్ రెడ్డి తెలిపారు. వైశాలి కుటుంబ సభ్యులు తనతో డబ్బులు ఖర్చు పెట్టించారని ఆరోపించారు. వైశాలి తల్లిదండ్రులు బీడీఎస్ పూర్తి అయిన తర్వాత వివాహం చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. పెళ్లికి వైశాలి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నవీన్ రెడ్డి సివిల్ కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపాడు.
అయితే ఇటీవల వైశాలికి వేరే సంబంధం కోసం నిశ్చితార్ధం జరగడంతో భరించలేని నవీన్ రెడ్డి .. వాళ్ల ఇంటిపై దాడి చేసి వైశాలిని బలవంతంగా తీసుకువెళ్లాడు. అయితే నవీన్ రెడ్డి చెబుతున్న మాటలను ఆమె తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. తమ కుమార్తెకు ఇష్టం లేదని చెబుతున్నా పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తూ ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడని చెబుతున్నారు. సినీ పక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. కాగా ఈ కేసులో నవీన్ రెడ్డితో సహా కిడ్నాప్ లో సహకరించిన మరి కొందరిపై కేసు నమోదు చేశారు.
కొనసాగుతున్న వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష .. పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం