అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సీఆర్డీఏపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బొత్స, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణం నిమిత్తం మొత్తం 64 వేల మంది రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. అందులో 43వేల ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగిందని బొత్స చెప్పారు. మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని తెలిపారు.
అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి బ్యాంక్, ఆర్థిక ఒప్పందాలను సీఎం జగన్ పరిశీలించారని, లక్ష్యాలను ఎలా చేరుకోవాలనే అంశంపై చర్చించారని చెప్పారు. అమరావతి మార్పు మీద అసలు చర్చే జరగలేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రాజధాని నిర్మాణాలపై ముందుకెళతామని ఆయన అన్నారు. రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని బొత్స పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదన్నారు. సుజనాచౌదరి సహా, బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ మీద తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బొత్స స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.