(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అత్యంత వేగంగా నాలుగు చక్రాల వాహనాన్ని నడిపే మహిళగా పేరు పొందిన అమెరికన్ సాహసి జెస్సీ కాంబ్స్ తన రికార్డును తానే బద్దలు కొట్టే ప్రయత్నంలో మంగళవారం దుర్మరణం పాలయింది.
36 ఏళ్ల కాంబ్స్ 2013లో అత్యంత వేగంగా వాహనం నడిపిన మహిళగా రికార్డు స్థాపించింది. ఆ రోజు ఆమె తన నార్త్ అమెరికన్ ఈగిల్ సూపర్సోనిక్ స్పీడ్ ఛాలెంజర్లో గంటకు 393 మైళ్ల వేగాన్ని నమోదు చేసింది. దానితో అప్పటికి 48 ఏళ్లుగా భద్రంగా ఉన్న రికార్డు బద్దలయింది. 2016లో కాంబ్స్ 478 మైళ్ల వేగం సాధించి మరో రికార్డు నెలకొల్పింది.
ఈ రికార్డును అధిగమించే ప్రయత్నంలోనే కాంబ్స్ నడుపుతున్న వాహనం ఒరేగాన్ ఎడారిలో ప్రమాదానికి గురయింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీ నంబరు 911కు ఫోన్ వచ్చింది. తర్వాత కాంబ్స్ టీమ్ సభ్యుడు టెర్రీ మాడెన్ ఆమె మృతిని ఇన్స్టాగ్రామ్లో ధృవీకరించాడు.
2013లో జెస్సీ కాంబ్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వీడియో: