(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ : కొత్తూరు తాడేపల్లిలో ఇళ్ల స్థలాల విషయంపై ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన అధికారులను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. కొత్తూరులో వ్యవసాయ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వనజాక్షి పాల్గొని మాట్లాడుతుండగా తమ భూములు తీసుకునేందుకు వీల్లేదంటూ రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో రైతులను కించపరిచేలా వనజాక్షి వ్యాఖ్యలు చేయడంతో రైతులు, మహిళలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆమెను చుట్టుముట్టి డౌన్ డౌన్ ఎం ఆర్ ఓ అంటూ నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను అక్కడ నుండి తీసుకోని వెళ్లారు.