జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలలో ఇరు పార్టీలకు రెబల్స్ బెడద తప్పటం లేదు. మరీ ముఖ్యంగా జనసేన నుంచి చాలామంది సీట్లు ఆశిస్తున్నారు. అయితే జనసేన కేవలం 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుంది. ఈ క్రమంలోనే మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన సీట్లు ఆశించి రాని నేతలు అంతా రెబల్స్ గా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేతలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. విశాఖ జిల్లాలో ఈ రెబల్స్ బెడద పలు నియోజకవర్గాలలో కనిపిస్తోంది.
విశాఖపట్నం నగరంలో అసెంబ్లీ సీటు ఆశించి భంగపడిన ఆ పార్టీ సీనియర్ నేత పాసర్ల ప్రసాద్ రెబల్గా బరిలోకి దిగేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు ఉన్నారు. 2014 – 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయనకే చంద్రబాబు మరోసారి సీటు ఇచ్చారు. అయితే పాసర్ల ప్రసాద్ తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా తన పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కష్టపడ్డాను అని.. ఈసారి అయినా తనకు టిడిపి టిక్కెట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకే టిక్కెట్ ఇచ్చారంటూ ఆయన వాపోతున్నారు.
పార్టీలో తాను చేసిన సేవకు గుర్తింపు లేదని.. అందుకే ఈసారి కఠిన నిర్ణయం తీసుకుంటున్నాను అని తన అనుచరులతో ప్రసాద్ చెప్పినట్టు తెలుస్తోంది.. వచ్చే ఎన్నికలలో ప్రసాద్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖపట్నం పశ్చిమంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అయితే 2009లో ఈ నియోజకవర్గంలో ఏర్పడినప్పటి నుంచి మూడుసార్లు ఒకే సామాజిక వర్గం గెలుస్తూ వస్తోంది. గవర సామాజిక వర్గం వారే ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతున్నారు. టిడిపి ఇక్కడ కొత్త ప్రయోగాలు చేయడం లేదు. దానితో పాసర్ల ప్రసాద్ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనవుతుంది. ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే టిడిపికి రాజకీయంగా నష్టమే అన్న చర్చలు నడుస్తున్నాయి.