BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలిగా ఉండి అరెస్టు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరో వైపు కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో కవితను ఈడీ అధికారులు కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చారు.
కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును అభ్యర్ధించారు. కేసు విచారణ పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కాగా, కవిత కేసులో ఇరువైపులా వాదనలు ముగిశాయి. కుమారుడు పరీక్షల నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 16వ తేదీ వరకూ పరీక్షలు ఉన్న నేపథ్యంలో కవిత తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ కోరారు.
ఇరువైపులా వాదనలు ముగియడంతో కొద్దిసేపటి తర్వాత న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 9 వరకూ (14 రోజులు) జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. కాగా, మద్యంతర బెయిల్ పై విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్సీ కవిత కోర్టు లోపలికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు.
తాత్కాలికంగా జైలుకు పంపవచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో జాయిన్ అయ్యారనీ, మరొకరు టికెట్ ఆశిస్తున్నారన్నారు. థర్డ్ ముద్దాయి ఎలక్టోరల్ రూపంలో రూ.50 కోట్లు ఇచ్చారన్నారు. ఇది ఫ్యాబ్రికేటెడ్, ఫాల్స్ కేసు అని కవిత వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదనీ.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని తెలిపారు.