Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ కస్టడీ నుండే ఆయన పాలన సాగిస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. కస్టడీ నుండి కేజ్రీవాల్ ఇచ్చిన ఆదేశాలపై ఈడీ ఓ పక్క దర్యాప్తు చేపట్టగా, ఇదే సమయంలో తాజాగా మరో ఉత్తర్వులు సీఎం జారీ చేయడం విశేషం.
మంగళవారం ఉదయం లాకప్ నుండి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్ లలో ఉచిత మందుల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. కస్టడీ లో ఉన్నప్పటికీ సీఎం కేజ్రీవాల్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి వెళ్లిన తర్వాత నీటి సమస్య నివారణ కోసం మంత్రి అతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది.
కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్ కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఈడీ అధికారులు మంత్రి అతిశీని ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో కస్టడీ నుండి ఆయన రెండో ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశం అయ్యింది.
London: లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్ధిని దుర్మరణం