అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్న టీడీపీ, జన సేన, బీజేపీలు సీట్లు పంచుకున్నాయి. ఇక, దాదాపు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. మొత్తంగా ఈ క్రవుతు ను దాదాపు అంటే.. 99 శాతం ముగించేశాయ్. పార్టీల పని పార్టీలు ముగించాయి. అయితే.. ఇప్పు డు తేల్చాల్సింది.. నాయకులు, కార్యకర్యలే. ఎంత పెద్ద పార్టీ అయినా.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల దన్ను లేకుండా అయితే.. ముందుకు సాగే పరిస్థితి లేదు.
ఎంత బలమైన నాయకుడు అయినా… జెండా పట్టుకునే కార్యకర్త బలం లేకుండా క్షేత్రస్థాయిలో ప్రజల ను కలిసే అవకాశం కూడా లేదు. ఈ విషయాన్ని చూస్తే.. ఏమేరకు కార్యకర్తలు, నాయకులు పనిచేస్తారనే ది ఇప్పుడు ఈ మూడు పార్టీల్లోనూ జరుగుతున్న చర్చ. మూడు పార్టీలు కూడా వలస నేతలకు టికెట్లు ఇచ్చాయి. అప్పటికప్పుడు పార్టీలొ చేరిన వారికి పోటీ చేసే అవకాశం కల్పించాయి. ఇది పార్టీలకు శరాఘాతంగా పరిణమించింది. అటు కాదనలేక.. ఇటు ఔననలేక పార్టీలు తర్జన భర్జన పడ్డాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రధానంగా ఏ డబ్బును కాదని.. ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నాయో.. అదే డబ్బు ఈ మూడు పార్టీలను శాసించింది. తాజా అంచనాల ప్రకారం.. మూడు పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకున్న నాయకుల్లో 90 శాతం మంది కోటీశ్వరులు. వ్యాపారులు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, ఇది వాస్తవం. ఆ పార్టీలు వెల్లడించిన వివరాలే బయట పెడుతున్నాయి. అంటే.. మొత్తంగా పార్టీల్లో ఇప్పటి వరకు ఉండి.. ఈ నాలుగేళ్లపాటు పార్టీని అన్ని రూపాల్లో కాచుకున్న నాయకులు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ పరిస్థితి ఆ పార్టీలకు కూడా తెలిసిందే. అయితే.. సర్వేలు. ఇతరత్రా కారణాలు చెప్పుకోవచ్చు. కానీ, అది వాస్తవం కాదని కొందరు అభ్యర్థుల విషయంలో స్పష్టంగా నిజమైంది. ఉదాహరణకు .. టీడీపీని తీసుకుంటే.. పాతగన్నవరం టికెట్ను ఎలాంటి సర్వేలు లేకుండా మహాసేన రాజేష్కు ఇచ్చారు. తర్వాత.. తప్పు దిద్దుకున్నా.. స్థానిక నేతలకు ఇవ్వకుండా.. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారు. ఇప్పుడైనా న్యాయం జరిగిందా? అంటే.. తెలంగాణకు చెందిన గిడ్డి సత్యనారాయణకు ఇక్కడ అవకాశం ఇచ్చారు.
ఇక, బీజేపీ కూడా తక్కువేమీ తినలేదు. పొరుగు జిల్లాల నుంచి నాయకులకు వేరే జిల్లాల్లో సీట్లు ఇచ్చారు. స్థానికంగా ఉన్న నాయకుల కొరత లేకపోయినా.. ఇలా వలసల వెనుక.. పార్టీలకు ఉన్న ధైర్యం కేవలం సొమ్ములు మాత్రమేననే టాక్ వినిపిస్తోంది. ఇది ఇప్పటికిప్పుడు బాగానే ఉందని అనుకున్నా. అంతిమంగా పోలింగ్బూత్కు వచ్చేసరికి ఈ ప్రభావం కనిపిస్తుందనేది పరిశీలకుల అంచనాగా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.