కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా పీడిస్తుందో చూస్తున్నాం. ఆరు నెలల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏ ఇద్దరు ముగ్గురు కలుసుకున్నా దీని గురించే మాట. దేశంలోనూ, రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ, మండలంలోనూ గ్రామంలోనూ ఇలా గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు కరోనా తప్ప వేరే ధ్యాస లేదు. ఇటువంటి కరోనా విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కలచి వేస్తున్నాయి. కరోనా వచ్చిన వారు చె ప్పుకోవడానికి భయపడుతున్నారు. ధైర్యంగా చెప్పుకునే వాళ్ళకి సాటి వారి నుంచి బాసట కరువు అవుతున్నది. మానవత్వం మరిచిన వేళన కరోనా ఖాటిన్యత మరింత ఎక్కువగా చూపిస్తుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు ఉదాహరణలు.
కరోనా రోగులకు సేవలు అందించే ఓ ఏఎన్ఎంను చుట్టుపక్కల వారు సామూహిక బహిష్కరణ చేసి ఆమె ఇంటి లోకి కూడా వెళ్ళకుండా అడ్డుకున్న సంఘటన సభ్య సమాజానికి తలవంపులు కల్గిస్తోంది. ఆ ఏఎన్ఎం భర్త కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోమ్ క్వారంటైన్ అవ్వాలని వైద్యులు సూచించారు. అతన్ని ఇంటి లోనికి వెళ్ళడానికి ఇంటి యజమాని అభ్యంతరం చెబితే ఆమె భర్తను మామ గారి ఇంటికి పంపించింది. తర్వాత ఏఎన్ఎం డ్యూటీ ముగించుకొని సొంత ఇంటికి వెళ్లగా చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి తాళం వేసి ఇంట్లో కి వెళ్ళనివ్వలేదు. రాత్రంతా వర్షంలోనే తడుస్తూ ఇంటి బయట గేటు ముందు ఆమె రోదిస్తూ కూర్చుంది. ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కరోనా వైరస్ నిర్ధారణ అయిన వ్యక్తులు తమకు కరోనా వచ్చిందని చెప్పుకోడానికి భయపడుతున్నారు. అందు కోసం కరోనా పరీక్షకు వెళ్ళిన వారు తప్పుడు అడ్రసు, తప్పుడు ఫోన్ నెంబరు ఇస్తున్నారు. ఈ విషయం తిరుపతిలో వెలుగు చూసింది. దాదాపు 236 మంది కరోనా పాజిటివ్ బాధితుల ఆచూకి లభించగా అధికారులు తలలు పట్టుకున్నారు. దీనిపై పోలీసు లకు సైతం ఫిర్యాదు చేశారు.
కరోనా రోగుల పట్ల అమానవీయంగా ప్రవర్తించడం దారుణం. ఈ రోజు అతనికి రావచ్చు, రేపు మనకు రావచ్చు అన్న ఇంగితం మరచి సభ్యసమాజం సిగ్గుపడే విధంగా సామూహిక బహిష్కరణలకు పాల్పడటం శోచనీయం.