ఢిల్లీ, ఫిబ్రవరి 12: కోర్టు ధిక్కారానికి పాల్పడిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అడిషనల్ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. సిబిఐ ప్రాసిక్యూషన్ డైరక్టర్ భాసు రామ్ కూడా కోర్టును ధిక్కరించారని పేర్కొంటూ ఆయనకు కూడా లక్ష రూపాయల జరిమానా విధించింది. ఇద్దరు అధికారులూ కోర్టు సమయం ముగిసే వరకూ కోర్టులో ఒక మూల కూర్చోవాలని ధర్మాసనం నిర్దేశించింది.
ముజఫర్పూర్ వసతి గృహం అత్యాచారాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జాయింట్ డైరెక్టర్ ఎకె శర్మను ఎం నాగేశ్వరరావు సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న సమయంలో బదిలీ చేశారు.
ముజఫర్పూర్ కేసు దర్యాప్తు నుండి ఎకె శర్మను తప్పించవద్దంటూ తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయన్ను బదిలీ చేయడంపై ఈ నెల ఏడున సర్వోన్నత న్యాయస్థానం నాగేశ్వరరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నాగేశ్వరరావుకు కోర్టు దిక్కరణ నోటీసు జారీ చేసింది. కోర్టుకు హజరై సంజయిషీ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నది.
తాను తప్పుచేశానని అంగీకరిస్తూ సుప్రీం ధర్మాసనానికి ఎం నాగేశ్వరరావు క్షమాపణలు తెలియజేస్తూ మంగళవారం ప్రమాణ పత్రాన్ని సమర్పించారు.
నాగేశ్వరరావు చెప్పిన క్షమాపణను సుప్రీం కోర్టు తిరస్కరించింది. లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు కోర్టు సమయం ముగిసే వరకూ కోర్టులోనే ఉండాలని ఆదేశించింది.